భాగ్యశ్రీతో ప్రేమాయణం వార్తలు, 'డబుల్ ఇస్మార్ట్' ఫెయిల్యూర్‌పై రామ్ పోతినేని స్పందన

  • హీరోయిన్ భాగ్యశ్రీతో డేటింగ్ రూమర్లపై స్పందించిన రామ్
  • ప్రేమ గీతం రాయడం వల్లే పుకార్లు మొదలయ్యాయన్న యంగ్ హీరో
  • అప్పటికి ఆ సినిమాకి హీరోయిన్ ఫైనల్ చేయలేదని వెల్లడి
యంగ్ హీరో రామ్ పోతినేని తన కొత్త చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ప్రమోషన్లలో భాగంగా, తనపై వస్తున్న డేటింగ్ రూమర్లపై స్పష్టత ఇచ్చారు. పి. మహేశ్‌బాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 27న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

ఈ చిత్రంలో రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ పుకార్లపై రామ్ స్పందిస్తూ, "ఈ సినిమా కోసం నేను ఓ ప్రేమ గీతం రాశాను. అప్పటినుంచే ఈ రూమర్స్ మొదలయ్యాయి. మనసులో ఏమీ లేకుండా అంత గొప్పగా పాట ఎలా రాస్తారని చాలా మంది అనుకున్నారు. కానీ నేను కేవలం సినిమాలోని పాత్రలను ఊహించుకొని ఆ పాట రాశాను. ఆ సమయానికి హీరోయిన్‌ను కూడా ఫైనల్ చేయలేదు" అని వివరించారు.

ఈ సందర్భంగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌పై తనకున్న అభిమానాన్ని పంచుకున్నారు. "చిన్నప్పటి నుంచి చెన్నైలో పెరగడంతో ఆయన సినిమాలన్నీ చూసేవాడిని. 'బాషా' సినిమా 100వ రోజు కూడా టికెట్లు దొరకని పరిస్థితి. ఆ రోజు థియేటర్‌లో అభిమానుల సంబరాలు చూసి ఆశ్చర్యపోయాను. ఆ అనుభవం ఎప్పటికీ మర్చిపోలేను" అని గుర్తుచేసుకున్నారు.

అలాగే, తన గత చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’ వైఫల్యం గురించి మాట్లాడుతూ, కథలో మంచి భావోద్వేగాలు ఉన్నప్పటికీ ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదని, అందుకే ఆశించిన ఫలితం రాలేదని అంగీకరించారు. ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ చిత్రంలో రామ్ ఒక స్టార్ హీరో అభిమాని పాత్రలో కనిపించనున్నారు.


More Telugu News