Chiranjeevi: ‘కొదమసింహం’ రీ రిలీజ్.. పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న చిరంజీవి

Chiranjeevi Shares Memories as Kodamasimham Re releases
  • ఆ సినిమా క్యాసెట్ పెడితేనే చరణ్ భోజనం చేసేవాడన్న చిరంజీవి
  • ‘కొదమసింహం’లో నా ఫేవరెట్ పాత్ర మోహన్‌బాబుదేనని వెల్లడి 
  • కౌబాయ్‌గా నటిస్తానని ఊహించలేదని వ్యాఖ్య 
  • ఈ నెల 21న మళ్లీ థియేటర్లలోకి ‘కొదమసింహం’ చిత్రం
మెగాస్టార్ చిరంజీవి నటించిన క్లాసిక్ కౌబాయ్ చిత్రం ‘కొదమసింహం’ 35 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలో సందడి చేయనుంది. 1990లో విడుదలైన ఈ సినిమాను ఈ నెల 21న రీ రిలీజ్ చేయనున్నారు. ఈ  సందర్భంగా హైదరాబాద్‌లో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి చిరంజీవి హాజరుకాకపోయినా, ఓ స్పెషల్ వీడియో ద్వారా సినిమాకు సంబంధించిన మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు.
 
కౌబాయ్ సినిమాలంటే తనకు చాలా ఇష్టమని, కానీ అలాంటి చిత్రంలో తాను నటిస్తానని ఎప్పుడూ ఊహించలేదని చిరంజీవి అన్నారు. ‘‘అప్పటికే కృష్ణ గారు నటించిన ‘మోసగాళ్లకు మోసగాడు’ సంచలనం సృష్టించింది. ఆ సమయంలో మరో కౌబాయ్ సినిమా చేయడం సాహసమే. నిర్మాత కైకాల నాగేశ్వరరావు గారు దర్శకుడు మురళీ మోహన్ రావును పరిచయం చేసి కథ చెప్పించారు. కథ నచ్చడంతో వెంటనే అంగీకరించాను. తొలిసారి గడ్డం పెంచి నటించిన సినిమా ఇదే’’ అని గుర్తుచేసుకున్నారు.
 
ఈ చిత్రంలో మోహన్‌బాబు పోషించిన ‘సుడిగాలి’ పాత్ర తన ఫేవరెట్ అని చిరంజీవి తెలిపారు. ఆ పాత్రకు మోహన్‌బాబు తప్ప మరెవరూ న్యాయం చేయలేరని ప్రశంసించారు. లెజెండరీ నటుడు ప్రాణ్‌తో కలిసి పనిచేయడం అదృష్టమన్నారు. రాజ్-కోటి అద్భుతమైన సంగీతం అందించారని, ప్రభుదేవా కొరియోగ్రఫీ హైలైట్‌గా నిలిచిందని చెప్పారు. ఓ పాటలో గోడపైకి డ్యాన్స్ చేస్తూ వెళ్లే సీన్‌ను హాలీవుడ్ సినిమా స్ఫూర్తితో తీశామని, అప్పట్లో అది అందరినీ ఆశ్చర్యపరిచిందని అన్నారు.
 
ఈ సినిమాతో రామ్ చరణ్‌కు ఉన్న అనుబంధాన్ని కూడా చిరంజీవి పంచుకున్నారు. ‘‘చిన్నప్పుడు చరణ్ భోజనం చేయాలంటే వాళ్లమ్మ ఈ సినిమా క్యాసెట్ పెట్టాల్సిందే. అప్పుడే వాడు అన్నం తినేవాడు’’ అని నవ్వుతూ చెప్పారు. ఈ తరం ప్రేక్షకులు కూడా ‘కొదమసింహం’ చిత్రాన్ని తప్పకుండా ఆస్వాదిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
Chiranjeevi
Kodamasimham
Kodamasimham re-release
Mohan Babu
Kaikala Nageswara Rao
Pran
Telugu Cowboy Movie
Ram Charan
Raj Koti
Prabhu Deva

More Telugu News