ఇక్కడకు రాకపోతే ఇవన్నీ మిస్ అయ్యేవాడిని: తమిళనాడులో ప్రధాని మోదీ

  • నాసాలో ఉద్యోగం వీడి వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకున్న వారిని చూశానన్న మోదీ
  • తనను పలకరించేందుకు రైతులు తమ చేతిలోని కండువాను ఊపారన్న మోదీ
  • దీనిని బట్టి తన కంటే ముందే బీహార్ గాలి ఇక్కడకు వచ్చినట్లు అర్థమైందన్న మోదీ
నాసాలో ఉద్యోగం విడిచి వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకున్న వారిని తాను చూశానని, తాను తమిళనాడుకు రాకపోతే ఇవన్నీ చూసే అవకాశం కోల్పోయేవాడినని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తమిళనాడులోని కోయంబత్తూరులో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగిస్తూ, తనకంటే ముందే బీహార్ గాలి తమిళనాడుకు వచ్చిందని పేర్కొన్నారు. రైతులు తనను పలకరించేందుకు తమ చేతిలోని కండువాను ఊపడంతో తనకు ఆ భావన కలిగిందని తెలిపారు.

నేను వేదికపైకి రాగానే రైతులు తమ చేతి కండువాను గాల్లోకి ఊపారని, తాను రావడానికి ముందే బీహార్ గాలి ఇక్కడకు వచ్చిందని ఆ దృశ్యాన్ని చూసి అర్థం చేసుకున్నానని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో కోయంబత్తూరు జౌళి పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తోందని ఆయన అన్నారు. ఈ ప్రాంతానికి చెందిన సీపీ రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా ఉన్నారని గుర్తు చేశారు. వ్యవసాయం తన మనసుకు ఎంతో దగ్గరగా ఉంటుందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.

ఇక్కడ తాను ఒక ఎగ్జిబిషన్ చూశానని, అందులో చాలా మంది రైతులతో మాట్లాడే అవకాశం తనకు లభించిందని అన్నారు. మెకానికల్ ఇంజినీరింగ్, పీహెచ్‌డీ చదువుకున్న వారు కూడా వ్యవసాయం చేస్తున్నారని చెప్పారు. నాసాలో ఉద్యోగం విడిచి వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకున్న వారిని తాను చూశానని, వారు యువతకు నైపుణ్యాలు నేర్పుతున్నారని అన్నారు. ఇక్కడకు రాకపోయి ఉంటే వాటిని చూసే అవకాశం ఉండేది కాదని, ఈ విషయాన్ని తాను బహిరంగంగా అంగీకరిస్తున్నానని అన్నారు. వారి ధైర్యానికి సెల్యూట్ చేస్తున్నట్లు తెలిపారు.

Narendra Modi
PM Modi
Tamil Nadu
Coimbatore
Agriculture
Farmers
Bihar
Textile Industry

More Telugu News