: ఎన్‌కౌంటర్ భయం ఉన్న మావోయిస్టులు 2026 మార్చి లోపల లొంగిపోండి: ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేశ్‌చంద్ర

  • జియ్యమ్మవలస ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతి
  • మృతుల్లో కీలక నేతలు ఉన్నట్లు భావిస్తున్నామన్న ఇంటెలిజెన్స్ ఏడీజీ
  • ఆపరేషన్ కగార్‌ ముగింపు లోపల లొంగిపోవాలని పిలుపు
ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టులపై ఎన్‌కౌంటర్లు కొనసాగుతున్నాయి. తాజాగా ఈ ఉదయం అల్లూరి జిల్లాలోని ఏజెన్సీలో ప్రాంతంలో ఉన్న జియ్యమ్మవలసలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మరణించినట్లు ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేశ్ చంద్ర లడ్డా ధ్రువీకరించారు. మృతుల్లో కీలక నేతలు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అందిందని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో వరుస ఎన్‌కౌంటర్లు జరుగుతున్న నేపథ్యంలో ఆయన కీలక ప్రకటన చేశారు.

మావోయిస్టులు లొంగిపోవడానికి వస్తే స్వాగతిస్తామని మహేశ్ చంద్ర లడ్డా స్పష్టం చేశారు. "ఆపరేషన్ కగార్"ను 2026 మార్చి నాటికి ముగిస్తామని, ఈలోగా ఎన్‌కౌంటర్ భయం ఉన్నవారు మీడియా ద్వారా అయినా లొంగిపోవచ్చని సూచించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 50 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశామని, లొంగిపోయిన వారిలో ఎవరినీ ఎన్‌కౌంటర్ చేయలేదని భరోసా ఇచ్చారు. ఇంకా ఎవరైనా మావోయిస్టులు ఉంటే పోలీసుల ఎదుట లొంగిపోవాలని ఆయన పిలుపునిచ్చారు.

ఇదిలా ఉండగా, నిన్న రంపచోడవరంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టుల మృతదేహాలు ప్రస్తుతం అక్కడి ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్నాయి. కాకినాడ, విశాఖపట్నం నుంచి ఫోరెన్సిక్ బృందాలు పోస్టుమార్టం నిర్వహించనున్నాయని, అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రి వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు.

More Telugu News