మావోయిస్టు కీలక నేత హిడ్మా మృతి... నిర్ధారించిన పోలీసులు

  • మారేడుమిల్లి ఎన్ కౌంటర్ లో హిడ్మా, ఆయన భార్య రాజే సహా మొత్తం ఆరుగురు మావోయిస్టులు మృతి
  • ఈ రోజు ఉదయం మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు
  • మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా తలపై రూ.6 కోట్ల రివార్డు
మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఈరోజు ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కీలక నేత, కేంద్ర కమిటీ సభ్యుడు మాద్వి హిడ్మా మృతిచెందారు. హిడ్మాతో పాటు ఆయన భార్య రాజీ, మరో నలుగురు మావోయిస్టులు పోలీసుల ఎదురుకాల్పుల్లో మరణించారు. ఈమేరకు హిడ్మా, రాజే మరణించిన విషయాన్ని పోలీసులు నిర్ధారిస్తూ వారి మృతదేహాల ఫొటోలను రిలీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలకు సంబంధించి కచ్చితమైన సమాచారంతో మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు ఈరోజు ఉదయం కూంబింగ్ చేపట్టాయని ఏపీ డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా తెలిపారు.

గెరిల్లా దాడుల వ్యూహకర్త..
చిన్న వయసులోనే మావోయిస్టు కేంద్ర కమిటీకి ఎంపికైన హిడ్మా.. గెరిల్లా దాడుల వ్యూహకర్తగా పేరొందారు. ఆయన స్వస్థలం ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా పూర్వాటి గ్రామం. పీపుల్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ కమాండర్‌గా, దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ సభ్యుడిగానూ హిడ్మా పనిచేశారు.

మృతులు..
మద్వి హిడ్మా, ఆయన భార్య రాజే, అనుచరులు మల్లా, దేవే, చెల్లూరి నారాయణ అలియాస్‌ సురేశ్‌, టెక్‌ శంకర్.


More Telugu News