యాత్రకు వెళ్లి పాక్‌లో పెళ్లి చేసుకున్నారా?.. భారత మహిళ మిస్సింగ్ కేసులో కొత్త కోణం!

  • పాకిస్థాన్‌కు యాత్రగా వెళ్లిన భారత సిక్కు మహిళ అదృశ్యం
  • యాత్ర ముగిసినా బృందంతో పాటు తిరిగిరాని వైనం
  • మతం మార్చుకుని స్థానికుడిని పెళ్లి చేసుకున్నట్లు ప్రచారం
  • ఆమె పేరు నూర్‌గా మార్చుకున్నట్లు వెలుగులోకి వచ్చిన 'నిఖామా'
  • ఘటనపై దర్యాప్తు చేస్తున్న భారత అధికారులు
గురునానక్ జయంతి వేడుకల కోసం పాకిస్థాన్‌కు వెళ్లిన భారత సిక్కు యాత్రికురాలు ఒకరు అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. ఆమె అక్కడ ఇస్లాం మతం స్వీకరించి, స్థానిక వ్యక్తిని వివాహం చేసుకున్నట్లుగా చెబుతున్న ఒక పత్రం వెలుగులోకి వచ్చింది. ఈ పరిణామంతో భారత అధికారులు అప్రమత్తమయ్యారు.

పంజాబ్‌లోని కపుర్తలాకు చెందిన 52 ఏళ్ల శరబ్‌జిత్ కౌర్, గురునానక్ 555వ జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఈ నెల‌ 4న వాఘా-అటారీ సరిహద్దు ద్వారా పాకిస్థాన్‌కు వెళ్లారు. దాదాపు 1,992 మంది యాత్రికులతో కూడిన బృందం పది రోజుల యాత్ర అనంతరం 13న భారత్‌కు తిరిగి వచ్చింది. అయితే, శరబ్‌జిత్ కౌర్ మాత్రం ఆ బృందంలో లేరు.

ఈ నేపథ్యంలో ఆమె పాకిస్థాన్‌లోని షేఖుపురాకు చెందిన నాసిర్ హుస్సేన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లుగా ఉన్న ఒక 'నిఖానామా' (ఇస్లామిక్ వివాహ ఒప్పందం) ఉర్దూ పత్రం బయటకు వచ్చింది. వివాహానికి ముందు ఆమె ఇస్లాం స్వీకరించి, తన పేరును నూర్‌గా మార్చుకున్నట్లు అందులో పేర్కొన్నారు. అయితే, ఈ పత్రం నిజ‌మైనదా? కాదా? అన్నది ఇంకా ధ్రువీకరణ కాలేదు.

శరబ్‌జిత్ కౌర్‌కు గతంలోనే విడాకులు అయ్యాయని, ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారని తెలిసింది. ఆమె భారత్‌కు తిరిగి రాకపోవడంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు వెంటనే పంజాబ్ పోలీసులకు, ఇతర భారత ఏజెన్సీలకు సమాచారం అందించారు. ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ ఐఏఎన్ఎస్ వార్తా సంస్థ తెలిపిన ప్రకారం, ఈ ఘటనపై భారత దౌత్య కార్యాలయం పాకిస్థాన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది.


More Telugu News