శ్రీనగర్ పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. ఏడుగురు అధికారులు దుర్మరణం

Srinagar Explosion Seven Killed in Police Station Blast
  • మృతుల్లో పోలీసులు, ఫోరెన్సిక్, రెవెన్యూ అధికారులు
  • ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలు పేలడంతో ప్రమాదం
  • గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి అత్యంత విషమం
  • ఈ పేలుడు పదార్థాలు ఢిల్లీ పేలుళ్ల సూత్రధారుల నుంచే స్వాధీనం
జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న భారీ పేలుడు పదార్థాలు పోలీస్ స్టేషన్‌లోనే పేలడంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. శ్రీనగర్‌లోని నౌగామ్ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం రాత్రి ఈ దుర్ఘటన జరిగింది.

వివరాల్లోకి వెళితే... ఇటీవల ఓ ఉగ్రవాద ముఠా నుంచి పోలీసులు భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఫోరెన్సిక్ బృందం సాయంతో పరిశీలిస్తుండగా అకస్మాత్తుగా అవి పేలిపోయాయి. దీంతో పోలీస్ స్టేషన్ ప్రాంగణం దద్దరిల్లింది. ఈ ప్రమాదంలో అక్కడే ఉన్న పోలీసులు, ఫోరెన్సిక్ అధికారులు, నయీబ్ తహసీల్దార్ సహా ఇద్దరు రెవెన్యూ అధికారులు అక్కడికక్కడే మృతి చెందారు.

గాయపడిన వారిని హుటాహుటిన సమీపంలోని ఆర్మీ ఆసుపత్రికి, షేర్-ఏ-కశ్మీర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్కిమ్స్)కు తరలించారు. వీరిలో ఐదుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఎన్డీటీవీ తన కథనంలో పేర్కొంది. ఘటన జరిగిన వెంటనే ఉన్నతాధికారులు నౌగామ్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని, ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

ఇటీవల జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన పోస్టర్ల కేసును ఛేదించింది ఇదే నౌగామ్ పోలీస్ స్టేషన్. ఈ దర్యాప్తులోనే వైద్యులు వంటి ఉన్నత విద్యావంతులతో నడుస్తున్న "వైట్ కాలర్ ఉగ్రవాద నెట్‌వర్క్" గుట్టురట్టయింది. ఈ ముఠా నుంచే భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల ఢిల్లీలో 13 మందిని బలిగొన్న కారు బాంబు పేలుడుకు కూడా ఇదే ముఠా కారణమని దర్యాప్తులో తేలింది. అప్పుడు స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలే ఇప్పుడు ఈ అధికారుల పాలిట మృత్యుపాశంగా మారడం తీవ్ర విషాదాన్ని నింపింది.
Go Back to Shorts
Srinagar Explosion
Jammu Kashmir
Naugam Police Station
IED Blast
Terrorist Explosives
Forensic Investigation
Jaish-e-Mohammed
White Collar Terror Network
Delhi Car Bombing

More Telugu News