నిర్మాత బెల్లంకొండ సురేశ్‌పై భూకబ్జా కేసు.. ఫిల్మ్‌నగర్‌లో కలకలం

  • ఫిల్మ్‌నగర్‌లోని ఓ ఇంటిని కబ్జా చేశారని ఆరోపణ
  • శివ ప్రసాద్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు
  • ఇంట్లోని సామాగ్రి ధ్వంసం చేశారని ఫిర్యాదులో వెల్లడి
  • వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు
  • ఈ వివాదంపై ఇంకా స్పందించని బెల్లంకొండ సురేశ్‌
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత బెల్లంకొండ సురేశ్‌పై భూకబ్జా ఆరోపణలతో కేసు నమోదైంది. హైదరాబాద్‌లోని ఖరీదైన ఫిల్మ్‌నగర్ ప్రాంతంలో తన ఇంటిని సురేశ్‌, ఆయన అనుచరులు అక్రమంగా ఆక్రమించుకున్నారని ఆరోపిస్తూ శివ ప్రసాద్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

వివ‌రాల్లోకి వెళితే.. ఫిల్మ్‌నగర్ రోడ్ నం.7లో ఉన్న తన ఇంటికి శివ ప్రసాద్ తాళం వేసి, కొంతకాలంగా బంధువుల వద్ద ఉంటున్నారు. ఇదే అదనుగా భావించిన బెల్లంకొండ సురేశ్‌, తన మనుషులతో కలిసి ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా ఇంట్లోని ఫర్నిచర్‌తో పాటు ఇతర సామగ్రిని ధ్వంసం చేసి, గోడలను పాడుచేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

కొన్నాళ్ల తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన శివ ప్రసాద్, లోపలి దృశ్యాలు చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ విషయంపై మాట్లాడేందుకు తన సిబ్బందిని బెల్లంకొండ సురేశ్‌ ఇంటికి పంపగా, అక్కడ తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుందని, వారిపై దాడికి కూడా ప్రయత్నించారని ఆయన వివరించారు.

శివ ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఫిల్మ్‌నగర్ పోలీసులు.. బెల్లంకొండ సురేశ్‌పై బీఎన్ఎస్ 329(4), 324(5), 351(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఈ తీవ్ర ఆరోపణలపై బెల్లంకొండ సురేశ్‌ వైపు నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. 


More Telugu News