CB Chandra Yadav: భారత సంతతి నేతకు డొనాల్డ్ ట్రంప్ క్షమాభిక్ష

Trump gives pre emptive pardon to Indian American Republican activist CB Chandra Yadav
  • భారత సంతతి రిపబ్లికన్ నేతకు క్షమాభిక్ష ప్రసాదించిన ట్రంప్
  • 2020 ఎన్నికల ఫలితాలను మార్చే యత్నాల కేసులో ఈ చర్య
  • సీబీ చంద్ర యాదవ్‌తో పాటు పలువురు కీలక నేతలకూ క్షమాభిక్ష
  • కేవలం ఫెడరల్ కేసులకే వర్తించనున్న ఈ ఆదేశాలు
  • బైడెన్ ప్రభుత్వం తమను వేధించిందన్న ట్రంప్ వర్గం
అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, భారత సంతతికి చెందిన రిపబ్లికన్ పార్టీ కార్యకర్త సీబీ చంద్ర యాదవ్‌కు ముందస్తు క్షమాభిక్ష ప్రసాదించారు. 2020 అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు కీలక రాజకీయ నేతలతో పాటు యాదవ్‌కు కూడా ఈ క్షమాభిక్ష వర్తిస్తుంది.

సోమవారం ప్రకటించిన ఈ క్షమాభిక్షలు కేవలం ఫెడరల్ స్థాయి నేరాలకు మాత్రమే పరిమితం. దీనివల్ల భవిష్యత్తులో ఫెడరల్ ప్రాసిక్యూటర్లు ఆయనపై ఎలాంటి అభియోగాలు మోపలేరు. అయితే, అమెరికా న్యాయవ్యవస్థలో ఫెడరల్, రాష్ట్రస్థాయి విచారణలు వేర్వేరుగా ఉంటాయి. అందుకే జార్జియాలో ఆయనపై నమోదైన రాష్ట్రస్థాయి కేసులకు ఈ క్షమాభిక్ష వర్తించదు. ఈ కేసులో ఆయనపై విచారణ కొనసాగే అవకాశం ఉంది.

ఈ క్షమాభిక్షలపై ట్రంప్ అధికార ప్రతినిధి కరోలిన్ లెవిట్ మాట్లాడుతూ.. "ఈ గొప్ప అమెరికన్లను బైడెన్ ప్రభుత్వం వేధించింది. ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన ఎన్నికలను సవాలు చేసినందుకు వారిని నరకయాతనకు గురిచేసింది" అని వ్యాఖ్యానించారు. తన ఉత్తర్వుల్లో ట్రంప్ కూడా, "2020 ఎన్నికల తర్వాత అమెరికా ప్రజలపై జరిగిన ఘోరమైన జాతీయ అన్యాయానికి ఈ క్షమాభిక్ష ముగింపు పలుకుతుంది. ఇది దేశంలో సయోధ్య ప్రక్రియను కొనసాగిస్తుంది" అని పేర్కొన్నారు.

2020 ఎన్నికల కేసులో జార్జియా రాష్ట్రంలో జో బైడెన్ విజయాన్ని తారుమారు చేసేందుకు తగినన్ని ఓట్లను గుర్తించాలని ట్రంప్ అక్కడి అధికారులను కోరినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో అధ్యక్షుడిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో పాల్గొనేందుకు నకిలీ ఎలక్టర్ల జాబితాను యాదవ్, మరికొందరు సమర్పించారని అభియోగాలు నమోదయ్యాయి.

ట్రంప్ క్షమాభిక్ష పొందిన వారిలో న్యూయార్క్ మాజీ మేయర్ రూడీ గిలియాని, సిడ్నీ పావెల్, జాన్ ఈస్ట్‌మన్, ట్రంప్ మాజీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మార్క్ మెడోస్ వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. అయితే, ఈ క్షమాభిక్ష ట్రంప్‌కు వర్తించదు.

ఎవరీ సీబీ చంద్ర యాదవ్?
సీబీ చంద్ర యాదవ్ మహారాష్ట్రలోని పుసద్‌లోని బీఎన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో పట్టభద్రులయ్యారు. ఆ తర్వాత ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి మేనేజ్‌మెంట్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయన గోప్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కు ఓనర్, సీఈఓగా ఉన్నారు. ఆయనకు పలు కిరాణా దుకాణాలు, మోటళ్లు ఉన్నాయి. జార్జియాలో వ్యాపార వృద్ధిని ప్రోత్సహించే జార్జియన్స్ ఫస్ట్ కమిషన్‌లోనూ, ఇతర రాష్ట్ర, స్థానిక ప్యానెళ్లలోనూ ఆయన సభ్యుడిగా పనిచేస్తున్నారు.
CB Chandra Yadav
Donald Trump
Pardon
2020 Election
Georgia
Republican Party
Indian American
Rudy Giuliani
Election Fraud
Mark Meadows

More Telugu News