క్రిస్మస్‌కు ‘దండోరా’... రిలీజ్ డేట్ ఫిక్స్!

  • ‘కలర్ ఫోటో’, ‘బెదురులంక’ నిర్మాత రవీంద్ర బెనర్జీ కొత్త చిత్రం
  • సామాజిక అంశాలతో తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సినిమా
  • శివాజీ, నవదీప్, నందు, బిందు మాధవి ప్రధాన పాత్రలు
  • ఆసక్తి రేపుతున్న వినూత్నమైన రిలీజ్ డేట్ పోస్టర్
  • మురళీకాంత్ దర్శకత్వంలో లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణం
జాతీయ అవార్డు అందుకున్న 'కలర్ ఫోటో', బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన 'బెదురులంక 2012' వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మిస్తున్న తాజా చిత్రం ‘దండోరా’. ఈ సినిమాను క్రిస్మస్ పండుగ సందర్భంగా డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది.

ఈ మేరకు ఓ ఆసక్తికరమైన పోస్టర్‌ను విడుదల చేశారు. ఖాళీ ప్రదేశంలో తవ్విన గొయ్యి కనిపిస్తున్న ఈ పోస్టర్‌పై ‘ఈ ఏడాదికి డ్రామాటిక్‌గా ముగింపునిస్తున్నాం’ అనే క్యాప్షన్‌తో రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో సున్నితమైన సామాజిక అంశాలను వ్యంగ్యం, హాస్యం, భావోద్వేగాల కలబోతగా చూపించనున్నట్టు మేకర్స్ తెలిపారు.

ఈ చిత్రంలో విలక్షణ నటుడు శివాజీతో పాటు నవదీప్, నందు, బిందు మాధవి, రవి కృష్ణ, మణిక, రాధ్య వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మురళీకాంత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు మార్క్ కె. రాబిన్ సంగీతం అందిస్తుండగా, వెంకట్ ఆర్. శాఖమూరి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. టీ-సిరీస్ ద్వారా ఈ సినిమా పాటలు విడుదల కానుండగా, అథర్వణ భద్రకాళి పిక్చర్స్ ఓవర్సీస్‌లో రిలీజ్ చేయనుంది.


More Telugu News