విశాఖలో రూ.5000 కోట్లతో లారస్ ల్యాబ్స్ భారీ ప్లాంట్

  • విశాఖలో లారస్ ల్యాబ్స్ భారీ పెట్టుబడి
  • రూ.5000 కోట్లతో అత్యాధునిక ఉత్పత్తి యూనిట్
  • 532 ఎకరాల భూమిని కేటాయించిన ప్రభుత్వం 
  • వచ్చే ఎనిమిదేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యం
  • మైసూరులో తలపెట్టిన యూనిట్‌ను కూడా విశాఖకు తరలింపు
  • మరిన్ని పెట్టుబడులకు సిద్ధమన్న సీఈఓ చావా సత్యనారాయణ
ప్రముఖ ఫార్మా సంస్థ లారస్ ల్యాబ్స్.. ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. విశాఖపట్నం వద్ద రూ.5,000 కోట్ల వ్యయంతో ఒక అత్యాధునిక, భారీ ఉత్పత్తి యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ఈ ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే 532 ఎకరాల భూమిని కేటాయించిందని లారస్ ల్యాబ్స్ సీఈఓ చావా సత్యనారాయణ తెలిపారు.

ఇటీవల జరిగిన ఇన్వెస్టర్స్ కాల్‌లో ఆయన ఈ కీలక వివరాలను వెల్లడించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించే ఈ మెగా యూనిట్‌ను రాబోయే ఎనిమిదేళ్లలో దశలవారీగా పూర్తి చేస్తామని ఆయన వివరించారు. ప్రాజెక్టు అవసరాలను బట్టి భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు సత్యనారాయణ స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మరో ముఖ్యమైన విషయాన్ని కూడా వెల్లడించారు. కర్ణాటకలోని మైసూరులో ఏర్పాటు చేయాలని తొలుత భావించిన భారీ ఫెర్మెంటేషన్ యూనిట్‌ను కూడా విశాఖపట్నంకు తరలిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో మొత్తం కార్యకలాపాలు విశాఖ కేంద్రంగానే జరగనున్నాయి. భారీ పెట్టుబడితో విశాఖ ఫార్మా రంగంలో మరింత కీలకంగా మారనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, ఈ సంస్థ‌కు హైద‌రాబాద్‌, ముంబ‌యి, బెంగ‌ళూరు, కాన్పూర్‌ల‌లో త‌యారీ, ప‌రిశోధ‌నా కేంద్రాలు ఉన్నాయి. మొత్తం ఏడు వేల‌కుపైగా ఉద్యోగులు ఉన్నారు. 


More Telugu News