కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తో ఏపీ మంత్రి నారా లోకేశ్ భేటీ

  • పాట్నాలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో లోకేశ్ భేటీ
  • బీహార్ ఎన్నికల వ్యూహాలపై చర్చించిన నేతలు
  • ఎన్డీఏ గెలుపునకు ప్రధాన్ కృషిని కొనియాడిన లోకేశ్
  • ఒడిశా, హర్యానా ఎన్నికల్లో ఆయన పాత్ర అమోఘమన్న మంత్రి
  • బీహార్‌లో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఖాయమని ధీమా
ఎన్డీయే తరఫున బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో పాట్నాలో సమావేశమయ్యారు. బీహార్ ఎన్నికల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఇది కేవలం మర్యాదపూర్వక సమావేశమేనని లోకేశ్ వెల్లడించారు. ఈ భేటీకి సంబంధించిన వివరాలను ఆయన స్వయంగా పంచుకున్నారు.

బీహార్ బీజేపీ ఎన్నికల ప్రచార బాధ్యతలు చూస్తున్న ధర్మేంద్ర ప్రధాన్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయినట్లు లోకేశ్ తెలిపారు. బీహార్‌లో ఎన్డీఏ కూటమి విజయం కోసం ప్రధాన్ అహరహం శ్రమిస్తున్నారని ఆయన కొనియాడారు. "గతేడాది జరిగిన హర్యానా, ఒడిశా ఎన్నికల్లో బీజేపీ గెలుపులో ప్రధాన్ గారు కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు బీహార్‌లో మరోమారు ఎన్డీఏ సర్కారును గెలిపించేందుకు ఆయన చేస్తున్న నిర్మాణాత్మక కృషిని ఈ సందర్భంగా అభినందించాను" అని లోకేశ్ పేర్కొన్నారు.

బీహార్‌లో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని నారా లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు ఎన్డీఏ పాలన వైపే మొగ్గు చూపుతున్నారని, ఎన్నికల ఫలితాలు కూటమికి అనుకూలంగా ఉంటాయని విశ్వాసం వ్యక్తం చేశారు.


More Telugu News