తుపాను నష్టం అంచనాకు ఏపీకి కేంద్ర బృందం.. 10, 11 తేదీల్లో పర్యటన

  • తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న కేంద్ర బృందం
  • ఈ నెల 10, 11 తేదీల్లో ఆరు జిల్లాల్లో నష్టం అంచనా
  • కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి పౌసమి బసు నేతృత్వం
  • రెండు బృందాలుగా విడిపోయి క్షేత్రస్థాయిలో పరిశీలన
  • పర్యటనకు ముందు తాడేపల్లిలో రాష్ట్ర అధికారులతో సమావేశం
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల సంభవించిన తుపాను కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర అధికారుల బృందం రాష్ట్రంలో పర్యటించనుంది. కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి పౌసమి బసు నేతృత్వంలోని 8 మంది సభ్యుల బృందం ఈ నెల 10, 11 తేదీల్లో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించనుంది.

పర్యటనలో భాగంగా కేంద్ర బృందం రెండు టీమ్‌లుగా విడిపోయి ఆరు జిల్లాల్లో నష్టాన్ని అంచనా వేస్తుంది. ఒక బృందం బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో పర్యటించనుండగా, మరో బృందం కృష్ణా, ఏలూరు, తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో పరిశీలన జరపనుంది. పంట నష్టంతో పాటు ఇతర ఆస్తి నష్టాలపై కూడా అధికారులు అంచనా వేయనున్నారు.

క్షేత్రస్థాయి పర్యటనకు ముందు, ఈ నెల 10వ తేదీ ఉదయం తాడేపల్లిలోని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో కేంద్ర బృందం రాష్ట్ర అధికారులతో సమావేశమవుతుంది. తుపాను నష్టంపై ప్రాథమిక వివరాలు, నివేదికలను రాష్ట్ర అధికారుల నుంచి సేకరిస్తుంది.

కేంద్ర బృందం పర్యటనను సమన్వయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. నోడల్ అధికారిగా విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ ప్రఖర్ జైన్‌ను, రాష్ట్ర స్థాయి లైజనింగ్ అధికారిగా ఈడీ వెంకట దీపక్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర బృందం ఇచ్చే నివేదిక ఆధారంగా రాష్ట్రానికి అందే తుపాను సహాయక నిధులపై స్పష్టత రానుంది. 


More Telugu News