జియో కీలక నిర్ణయం... ఇకపై అన్ని వయసుల వారికీ గూగుల్ జెమినీ ఏఐ ప్రో

  • జియో యూజర్లకు గూగుల్ జెమినీ ఏఐ ప్రో ప్లాన్ ఉచితం
  • ఇకపై అన్ని వయసుల వారికి అందుబాటులోకి ఆఫర్
  • రూ. 35,100 విలువైన ప్లాన్ 18 నెలల పాటు ఉచితం
  • అన్‌లిమిటెడ్ 5జీ ప్లాన్ యూజర్లకు మాత్రమే అవకాశం
ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన వినియోగదారులకు ఒక బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. గూగుల్ జెమినీ ఏఐ ప్రో ప్లాన్‌ను ఉచితంగా అందిస్తున్నట్లు వెల్లడించింది. మొదట్లో కేవలం 18 నుంచి 25 ఏళ్ల యువతకు మాత్రమే పరిమితమైన ఈ ఆఫర్‌ను, తాజాగా 25 ఏళ్లు పైబడిన వారికి కూడా విస్తరించినట్లు తెలుస్తోంది. దీంతో జియో 5జీ యూజర్లందరూ ఈ సదుపాయాన్ని పొందేందుకు అర్హులయ్యారు.

ఈ ఆఫర్‌లో భాగంగా యూజర్లు రూ.35,100 విలువైన జెమినీ ఏఐ ప్రో ప్లాన్‌ను ఏకంగా 18 నెలల పాటు ఉచితంగా పొందవచ్చు. అయితే, ఈ ప్రయోజనం పొందాలంటే కచ్చితంగా అన్‌లిమిటెడ్ 5జీ ప్లాన్ యాక్టివేట్ చేసుకుని ఉండాలి. అంటే, నెలకు కనీసం రూ.349 లేదా అంతకంటే ఎక్కువ విలువైన ప్లాన్‌తో రీఛార్జి చేసుకునే వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది.

ఈ ప్లాన్ కింద యూజర్లకు అత్యాధునిక జెమినీ 2.5 ప్రో మోడల్‌తో పాటు 2జీబీ క్లౌడ్ స్టోరేజీ లభిస్తుంది. అంతేకాకుండా, వియో 3.1 వీడియో జనరేటర్, నానో బనానా ఇమేజ్ జనరేషన్ వంటి ప్రత్యేక ఫీచర్లను కూడా ఉపయోగించుకోవచ్చు. వీటితో పాటు నోట్‌బుక్ ఎల్ఎం, జెమినీ కోడ్ అసిస్ట్, జీమెయిల్, డాక్స్‌లో జెమినీ సేవలను కూడా ఈ ప్లాన్‌లో భాగంగా పొందవచ్చు.

ఈ ఆఫర్‌ను పొందేందుకు జియో యూజర్లు తమ ఫోన్‌లోని మై జియో యాప్‌ను ఓపెన్ చేయాలి. యాప్‌లో కనిపించే 'క్లెయిమ్ నౌ' అనే బ్యానర్‌పై క్లిక్ చేసి ప్లాన్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. అయితే, ప్రస్తుతం ఈ ఆఫర్ కొందరు యూజర్లకు మాత్రమే కనిపిస్తోంది. మరికొందరికి 'రిజిస్టర్ ఇంట్రెస్ట్' అనే ఆప్షన్ చూపిస్తున్నట్లు సమాచారం. కంపెనీ ఈ సదుపాయాన్ని దశలవారీగా అందరికీ అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. 


More Telugu News