ఛత్తీస్‌గఢ్‌లో ఒకే రైల్వే ట్రాక్‌పై మూడు రైళ్లు!

  • బిలాస్‌పూర్‌లో ఒకే ట్రాక్‌పైకి వచ్చిన రైళ్లు
  • ఒక ప్యాసింజర్ రైలు, రెండు గూడ్స్ రైలు
  • అప్రమత్తమై ఆపేసిన ప్యాసింజర్ రైలు లోకోపైలట్
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బిలాస్‌పూర్‌‍లో ఒకే ట్రాక్‌పై మూడు రైళ్లు రావడంతో అక్కడ ఉన్నవారంతా భయాందోళనలకు గురయ్యారు. కొన్ని రోజుల క్రితం ఇదే రాష్ట్రంలో గూడ్స్ రైలును ప్యాసింజర్ రైలు ఢీకొన్న ఘటనలో లోకోపైలట్‌తో సహా 11 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడు రైళ్లు ఒకే ట్రాక్‌పైకి రావటం కలవరపాటుకు గురిచేసింది.

కోట్మి సోనార్, జైరాంనగర్ స్టేషన్ల మధ్య ఉన్న ట్రాక్‌పై ఒకేసారి రెండు గూడ్స్ రైళ్లు, ఒక ప్యాసింజర్ రైలు వచ్చాయి. అది గమనించిన ప్యాసింజర్ రైలు లోకో పైలట్ వెంటనే రైలును ఆపేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

ప్యాసింజర్ రైలు కదులుతూ ఉండగా ఈ సంఘటన జరిగింది. ట్రాక్‌పై ప్యాసింజర్ రైలు ఉండగా, హఠాత్తుగా ముందు నుంచి ఒకటి, వెనుక నుంచి ఒకటి గూడ్స్ రైళ్లు ట్రాక్ పైకి వచ్చాయి. ఇది గమనించిన ప్యాసింజర్ రైలు ప్రయాణికులు భయానికి గురయ్యారు. లోకోపైలట్ అప్రమత్తమై రైలును నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది.


More Telugu News