విజయవాడ జైలు నుంచి నెల్లూరు జైలుకు జోగి రమేశ్ తరలింపు

  • నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్‌కు రిమాండ్
  • ఆయన సోదరుడు రాముకు కూడా రిమాండ్ విధించిన న్యాయస్థానం
  • ఈ నెల 13వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీకి ఆదేశం
నకిలీ మద్యం కేసులో అరెస్టయిన మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్‌, ఆయన సోదరుడు రాముకు న్యాయస్థానం 10 రోజుల రిమాండ్ విధించింది. ఈ నెల 13వ తేదీ వరకు వారికి జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఈ తెల్లవారుజామున ఆదేశాలు జారీ చేశారు. కోర్టు ఆదేశాల మేరకు తొలుత విజయవాడ జైలుకు వారిని తరలించారు. అనంతరం నెల్లూరు జైలుకు మార్చారు.

నిన్న ఉదయం ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలో జోగి రమేశ్‌ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం విజయవాడలోని తూర్పు ఎక్సైజ్‌శాఖ కార్యాలయానికి తరలించి సుమారు 12 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న జనార్దనరావుతో ఉన్న సంబంధాలపై అధికారులు ఆరా తీశారు. రమేశ్‌తో పాటు ఆయన సోదరుడు రామును కూడా వేర్వేరుగా, కలిపి ప్రశ్నించి వివరాలు సేకరించారు.

విచారణ అనంతరం వైద్య పరీక్షలు పూర్తి చేసి, సోదరులిద్దరినీ న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఇరుపక్షాల వాదనలు ప్రారంభమయ్యాయి. సుదీర్ఘ వాదనల అనంతరం సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు న్యాయమూర్తి తీర్పు వెలువరిస్తూ రిమాండ్‌కు ఆదేశించారు. దీంతో తొలుత వారిని విజయవాడ జిల్లా జైలుకు, అక్కడి నుంచి నెల్లూరు కేంద్ర కారాగారానికి తరలించారు. 


More Telugu News