గద్వాల బీసీ హాస్టల్‌లో కలకలం.. 53 మంది విద్యార్థులు ఆసుపత్రిపాలు

  • జోగులాంబ గద్వాల జిల్లా బీసీ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్
  • కలుషిత ఆహారం తిని 53 మంది విద్యార్థులకు అస్వస్థత
  • వాంతులు కావడంతో గద్వాల ఏరియా ఆసుపత్రికి తరలింపు
  • ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడి
  • ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న జిల్లా కలెక్టర్
జోగులాంబ గద్వాల జిల్లాలో కలుషిత ఆహారం తిని పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఎర్రవల్లి మండలం ధర్మవరంలోని బీసీ వసతిగృహంలో శుక్రవారం రాత్రి భోజనం వికటించి 53 మంది విద్యార్థులు ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం వారంతా గద్వాల ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, వారి ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.

వివరాల్లోకి వెళితే.. ధర్మవరం బీసీ హాస్టల్‌లో మొత్తం 125 మంది విద్యార్థులు ఉండగా, శుక్రవారం 110 మంది హాజరయ్యారు. రాత్రి భోజనం చేసిన తర్వాత సుమారు 9 గంటల సమయంలో 86 మంది విద్యార్థులు వాంతులు చేసుకోవడం మొదలుపెట్టారు. దీంతో వసతిగృహం సిబ్బంది, స్థానిక పోలీసులు వెంటనే స్పందించి అంబులెన్స్‌లలో విద్యార్థులను గద్వాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వారికి తక్షణమే చికిత్స అందించారు.

ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్‌ స్పందించారు. ఫుడ్ పాయిజన్ కారణంగా 53 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన మాట వాస్తవమేనని, సమాచారం అందిన వెంటనే జిల్లా యంత్రాంగం వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించిందని తెలిపారు. 

"ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం నియంత్రణలోనే ఉంది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వైద్యులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు" అని కలెక్టర్ వివరించారు. ప్రస్తుతం 53 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వారి పరిస్థితి బాగానే ఉందని అధికారులు పేర్కొన్నారు.


More Telugu News