ప్రధాని మోదీ తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారు: స్టాలిన్ ఫైర్

MK Stalin Fires Back at Modi Over Tamil Nadu Remarks
షార్ట్స్‌లో చూడండి
తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం బీహార్ వలస కార్మికులను వేధిస్తోందంటూ ప్రధాని మోదీ చేసిన ఆరోపణలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రధాని తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారంటూ ఘాటుగా బదులిచ్చారు.

బీహార్‌లో జరిగిన ఓ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో పనిచేస్తున్న బీహారీ కార్మికులను డీఎంకే ప్రభుత్వం అవమానిస్తోందని, వారిపై వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో, ప్రధాని వ్యాఖ్యలను ఖండిస్తూ సీఎం స్టాలిన్ 'ఎక్స్' వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు.

"ఒక తమిళుడిగా ప్రధాని మోదీని నేను వినయంగా కోరుతున్నాను. ఆయన దేశ ప్రజలందరికీ ప్రధాని అనే గౌరవప్రదమైన స్థానంలో ఉన్నారనే విషయాన్ని తరచుగా మర్చిపోతున్నారేమో అని బాధగా ఉంది. ఇలాంటి ప్రకటనలతో తన పదవికి ఉన్న గౌరవాన్ని కోల్పోవద్దు" అని స్టాలిన్ పేర్కొన్నారు. బీజేపీ సభ్యులు కేవలం ఎన్నికల రాజకీయాల కోసం ఒడిశా, బీహార్ అంటూ తమిళులపై తమ ద్వేషాన్ని ప్రదర్శిస్తున్నారని, ఒక ముఖ్యమంత్రిగా ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.

హిందువులు, ముస్లింల మధ్య శత్రుత్వం పెంచినట్లే, ఇప్పుడు తమిళులు, బీహార్ ప్రజల మధ్య విరోధం సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని స్టాలిన్ విమర్శించారు. "ఇటువంటి చిల్లర రాజకీయ పద్ధతులు మానుకుని, దయచేసి దేశ సంక్షేమంపై దృష్టి పెట్టండి" అని ప్రధానికి, బీజేపీ నేతలకు ఆయన హితవు పలికారు. ప్రధాని వ్యాఖ్యలతో దక్షిణాది రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. 
Go Back to Shorts
MK Stalin
Stalin
Prime Minister Modi
Tamil Nadu
Bihar Migrant Workers
DMK
BJP Politics
South India Politics
Election Campaign
Hate Speech

More Telugu News