రాష్ట్ర పండుగగా సీపీ బ్రౌన్ జయంతి .. ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ
- ప్రతి ఏటా నవంబర్ 10న అధికారికంగా వేడుకలు
- ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన పర్యాటక శాఖ
- తెలుగు భాషకు ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ నిర్ణయం
ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో సీపీ బ్రౌన్ తెలుగు భాషకు చేసిన సేవలను ప్రత్యేకంగా ప్రస్తావించింది. "ఆయన తన ఖాళీ సమయాన్ని, సంపాదనలో ప్రతి రూపాయిని తెలుగు భాష, సాహిత్య పునరుజ్జీవనం కోసమే వెచ్చించారు. తెలుగు అధ్యయనాలకు కృషి చేసిన యూరోపియన్ పండితుల్లో సీపీ బ్రౌన్ పేరు ఒక దీపంలా వెలుగుతుంది" అని ప్రభుత్వం కొనియాడింది.
లండన్ విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్యునిగా పనిచేసిన ఆయన, తన చివరి శ్వాస వరకు తెలుగు భాషకే అంకితమయ్యారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తెలుగు సాహిత్యం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడిగా సీపీ బ్రౌన్ను ప్రభుత్వం గౌరవించింది. ఈ నిర్ణయంతో తెలుగు భాషకు ఆయన అందించిన సేవలకు సముచిత గౌరవం లభించినట్లయింది.