Central Government Employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

Central Government Employees to Get 8th Pay Commission Approval
  • 8వ కేంద్ర వేతన సంఘం విధివిధానాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం
  • కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల పెంపుపై సిఫార్సులు
  • నియామకం జరిగిన 18 నెలల్లోగా కమిషన్ నివేదిక సమర్పణ
  • దేశ ఆర్థిక పరిస్థితి, రాష్ట్రాలపై ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోనున్న సంఘం
  • సుమారు 50 లక్షల ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం
  • 2026 జనవరి 1 నుంచి సిఫార్సులు అమల్లోకి వచ్చే అవకాశం
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఇది శుభవార్త. లక్షలాది మంది ఎదురుచూస్తున్న 8వ కేంద్ర వేతన సంఘం (8th Central Pay Commission) ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం సమావేశమైన కేంద్ర కేబినెట్.. 8వ వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించిన విధివిధానాలకు (Terms of Reference) ఆమోదముద్ర వేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షనర్ల చెల్లింపుల పెంపుపై ఈ కమిషన్ త్వరలో తన పనిని ప్రారంభించనుంది.

ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా సుమారు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మందికి పైగా పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. వేతన సంఘం ఒక తాత్కాలిక వ్యవస్థలా పనిచేస్తుంది. ఇందులో ఒక ఛైర్‌పర్సన్, ఒక పార్ట్‌టైమ్ సభ్యుడు, ఒక మెంబర్-సెక్రటరీ ఉంటారు. ఈ కమిషన్ తన నియామకం జరిగిన తేదీ నుంచి 18 నెలల్లోగా ప్రభుత్వానికి తన సిఫార్సులను సమర్పించాల్సి ఉంటుంది. అవసరమైతే, తుది సిఫార్సులకు ముందే మధ్యంతర నివేదికలు కూడా ఇచ్చే వెసులుబాటును కల్పించారు.

సిఫార్సులు చేసేటప్పుడు కమిషన్ పలు కీలక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని కేబినెట్ నిర్దేశించింది. దేశ ఆర్థిక పరిస్థితి, ఆర్థిక క్రమశిక్షణ ఆవశ్యకత, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల లభ్యత వంటి అంశాలను పరిశీలించనుంది. అలాగే, ఈ సిఫార్సుల ప్రభావం రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక వ్యవస్థపై ఎలా ఉంటుందో కూడా అంచనా వేయనుంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు (PSU), ప్రైవేట్ రంగంలోని ఉద్యోగుల జీతభత్యాలు, పని పరిస్థితులను కూడా దృష్టిలో ఉంచుకుని నివేదిక రూపొందించాల్సి ఉంటుంది.

సాధారణంగా ప్రతి పదేళ్లకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తుంది. ఉద్యోగుల జీతభత్యాలు, పదవీ విరమణ ప్రయోజనాలు, ఇతర సేవా నిబంధనలను సమీక్షించి, వాటిలో మార్పులను సూచించడం ఈ కమిషన్ ప్రధాన విధి. ఈ క్రమంలో, 8వ వేతన సంఘం సిఫార్సులు 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని అంచనా వేస్తున్నారు. 7వ వేతన సంఘాన్ని 2014 ఫిబ్రవరిలో ఏర్పాటు చేయగా, దాని సిఫార్సులను ప్రభుత్వం 2016 జనవరి నుంచి అమలు చేసిన విషయం తెలిసిందే. 8వ వేతన సంఘం ఏర్పాటుపై ప్రభుత్వం 2025 జనవరిలో ప్రకటన చేసింది. తాజాగా కేబినెట్ ఆమోదంతో ఈ ప్రక్రియ అధికారికంగా ముందుకు సాగనుంది.
Central Government Employees
8th Central Pay Commission
Central Pay Commission
Narendra Modi
Central Government Pensioners
Government Employees Salary Hike
Pensioners Benefits
Salary Revision
Government Jobs
Pay Scale

More Telugu News