Montha Cyclone: మొంథా తుపాను ఎఫెక్ట్: తెలంగాణలో నేడు, రేపు అతి భారీ వర్షాలు.. 92 రైళ్ల రద్దు

Montha Cyclone triggers heavy rains in Telangana 92 trains cancelled
  • బంగాళాఖాతంలో తుపానుగా మారిన వాయుగుండం
  • నేడు కాకినాడ వద్ద తీరాన్ని దాటే అవకాశం
  • రాష్ట్రానికి ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
  • పంట నష్టం జరగకుండా చూడాలని సీఎం రేవంత్ ఆదేశం
  • 92 ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్ల రద్దు 
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరింత బలపడి 'మొంథా' తుపానుగా మారింది. ఆదివారం రాత్రి ఇది తుపానుగా మారినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ తుపాను నేటి ఉదయానికి తీవ్ర తుపానుగా బలపడి, సాయంత్రం లేదా రాత్రికి ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ సమీపంలో, మచిలీపట్నం-కళింగపట్నం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో తెలంగాణలో రాబోయే రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు.

వాతావరణ శాఖ సూచనల ప్రకారం నేడు, రేపు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా నేడు పెద్దపల్లి, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, హైదరాబాద్, మేడ్చల్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.

తుపాను హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో ధాన్యం, పత్తి, మొక్కజొన్న పంటల కొనుగోళ్లు జరుగుతున్నందున, రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి, పరిస్థితిని సమీక్షించారు.

మరోవైపు, ప్రయాణికుల భద్రత దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తుపాను ప్రభావిత ప్రాంతాల మీదుగా ప్రయాణించే 92 ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. వీటిలో హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వైపు వెళ్లే 10 ఎక్స్‌ప్రెస్ రైళ్లు కూడా ఉన్నాయి. నేడు, రేపు రద్దయిన వాటిలో జన్మభూమి, ఫలక్‌నుమా, గోదావరి, గరీబ్‌రథ్‌, విశాఖ ఎక్స్‌ప్రెస్ వంటి కీలక రైళ్లు ఉన్నాయి. దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్‌కుమార్‌ శ్రీవాస్తవ విజయవాడలో భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.
Montha Cyclone
Telangana rains
Heavy rainfall alert
South Central Railway
Cancelled trains
Hyderabad weather
Revant Reddy
Andhra Pradesh cyclone
Kakinda
Machilipatnam

More Telugu News