Biju: కేరళలో పెను విషాదం: అధికారుల హెచ్చరికతో ఇల్లు వీడి.. తిరిగి రాగానే కూలిన కొండచరియ, వ్యక్తి మృతి

Idukki Landslide Biju Dies Wife Injured After Returning Home
  • కేరళ ఆదిమలిలో విధి ఆడిన వింత నాటకంలో వ్యక్తి దుర్మరణం.
  • జాతీయ రహదారి పనుల వద్ద కొండచరియలు విరిగిపడి 8 ఇళ్లు ధ్వంసం.
  • హెచ్చరికలతో సురక్షిత ప్రాంతానికి వెళ్లి, భోజనం కోసం తిరిగొచ్చిన దంపతులపై విరుచుకుపడిన మట్టిపెళ్లలు.
  • శిథిలాల కింద నలిగిపోయి భర్త మృతి, భార్యకు తీవ్ర గాయాలు
ప్రాణభయంతో ఇల్లు వదిలి సురక్షిత ప్రాంతానికి వెళ్లారు. కానీ ఆకలి వారిని వెనక్కి పిలిచింది. ఒక్క పూట భోజనం వండుకుని వద్దామని తిరిగి ఇంటికి వచ్చిన వారిపై మృత్యువు కొండచరియల రూపంలో విరుచుకుపడింది. ఈ హృదయ విదారక ఘటనలో భర్త ప్రాణాలు కోల్పోగా, భార్య చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. కేరళలోని ఇడుక్కి జిల్లా ఆదిమలిలో శనివారం రాత్రి ఈ పెను విషాదం చోటుచేసుకుంది.

ఆదిమలి సమీపంలోని మన్నంకండం ప్రాంతంలో జాతీయ రహదారి-85 విస్తరణ పనులు జరుగుతున్నాయి. దీని కోసం కొండలను తవ్వుతుండటంతో భారీ పగుళ్లు ఏర్పడ్డాయి. ఏ క్షణంలోనైనా కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని గుర్తించిన అధికారులు, కొండ దిగువన నివసిస్తున్న 22 కుటుంబాలను శనివారం సాయంత్రమే ఇళ్లు ఖాళీ చేయించి సహాయక శిబిరాలకు తరలించారు. వారిలో లక్షంవీడు కాలనీకి చెందిన బీజు (48), ఆయన భార్య సంధ్య కూడా ఉన్నారు.

అయితే, శిబిరంలో భోజన ఏర్పాట్లు లేకపోవడంతో రాత్రి వంట చేసుకుని తినేందుకు బీజు, సంధ్య తిరిగి తమ ఇంటికి వెళ్లారు. వారు వంట చేస్తున్న సమయంలో రాత్రి 10:30 గంటలకు ఒక్కసారిగా పెను శబ్దంతో కొండచరియలు వారి ఇంటితో పాటు చుట్టుపక్కల ఉన్న మరో ఏడు ఇళ్లపై కూలాయి. క్షణాల్లో ఇళ్లన్నీ మట్టిదిబ్బలుగా మారిపోయాయి.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, విపత్తు నిర్వహణ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. స్థానికుల సహాయంతో అర్ధరాత్రి వేళ సహాయక చర్యలు చేపట్టాయి. సుమారు ఐదు గంటల పాటు శ్రమించి శిథిలాల కింద నుంచి బీజు, సంధ్యలను బయటకు తీశారు. అయితే, అప్పటికే బీజు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న సంధ్యను సమీపంలోని ఆసుపత్రికి, అనంతరం మెరుగైన చికిత్స కోసం అలువాలోని ప్రత్యేక ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది.

గతేడాదే తమ కుమారుడిని కోల్పోయిన బీజు కుటుంబంలో ఈ ఘటన మరో తీవ్ర విషాదాన్ని నింపింది. వారి కుమార్తె కొట్టాయంలో నర్సింగ్ విద్యనభ్యసిస్తోంది. ఈ ఘటనపై ఆదిమలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం బీజు మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు.
Biju
Kerala landslide
Idukki district
Mannankandam
National Highway 85
Landslide tragedy
Adimali
Kerala floods
Disaster management

More Telugu News