వన్డే క్రికెట్ చరిత్రలో ఫస్ట్ టైమ్... మొత్తం 50 ఓవర్లను స్పిన్నర్లతో బౌలింగ్ చేయించిన వెస్టిండీస్

  • వన్డే క్రికెట్ చరిత్రలో వెస్టిండీస్ అరుదైన రికార్డు
  • బంగ్లాదేశ్‌పై 50 ఓవర్లు స్పిన్నర్లతోనే బౌలింగ్
  • తలా 10 ఓవర్లు విసిరిన ఐదుగురు స్పిన్నర్లు 
  • ఈ ఘనత సాధించిన తొలి పూర్తిస్థాయి సభ్యదేశంగా విండీస్
  • రిషద్ హొస్సేన్ మెరుపు ఇన్నింగ్స్‌తో బంగ్లాకు గౌరవప్రదమైన స్కోరు
  • సూపర్ ఓవర్ లో విండీస్ విజయం
అంతర్జాతీయ వన్డే క్రికెట్ చరిత్రలో వెస్టిండీస్ జట్టు ఒక అరుదైన ప్రపంచ రికార్డును నెలకొల్పింది. మంగళవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 50 ఓవర్ల పాటు కేవలం స్పిన్నర్లతోనే బౌలింగ్ చేసి చరిత్ర సృష్టించింది. వన్డే ఫార్మాట్‌లో ఒక పూర్తిస్థాయి సభ్యదేశం ఇలా చేయడం ఇదే తొలిసారి. ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియం ఈ చరిత్రాత్మక ఘట్టానికి వేదికగా నిలిచింది.

ఈ మ్యాచ్‌కు ఉపయోగించిన పిచ్ పూర్తిగా పొడిగా, పగుళ్లతో స్పిన్‌కు అనుకూలంగా ఉండటంతో విండీస్ కెప్టెన్ ఈ సాహసోపేత నిర్ణయం తీసుకున్నాడు. జట్టులోని ఐదుగురు స్పిన్నర్లు అకీల్ హోసేన్, రోస్టన్ ఛేజ్, ఖారీ పియర్, గుడకేశ్ మోటీ, అలిక్ అథనేజ్ తమ 10 ఓవర్ల కోటాను పూర్తి చేశారు. వీరి స్పిన్ దాటికి బంగ్లా బ్యాటర్లు పరుగులు చేయడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ 46 ఓవర్లకు 163/7 స్కోరుతో కష్టాల్లో పడింది.

ఈ దశలో క్రీజులోకి వచ్చిన స్పిన్ ఆల్‌రౌండర్ రిషద్ హొస్సేన్ తన మెరుపు బ్యాటింగ్‌తో ఇన్నింగ్స్ స్వరూపాన్నే మార్చేశాడు. కేవలం 14 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 39 పరుగులు బాదాడు. అతని విధ్వంసం కారణంగా చివరి నాలుగు ఓవర్లలో బంగ్లాదేశ్ ఏకంగా 50 పరుగులు రాబట్టింది. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 213 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో సౌమ్య సర్కార్ 89 బంతుల్లో 45 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

వెస్టిండీస్ బౌలర్లలో గుడకేశ్ మోటీ మూడు వికెట్లతో రాణించగా, అథానాజే, హోసేన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. బ్యాటింగ్‌కు కష్టతరంగా ఉన్న ఈ పిచ్‌పై 214 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం విండీస్‌కు సవాలుగా మారింది. అయితే స్కోర్లు సమం కావడంతో, సూపర్ ఓవర్ వరకు వెళ్లిన ఈ మ్యాచ్ లో విండీస్ నే విజయం వరించింది.


More Telugu News