నా కోడళ్లతో 'గర్ల్స్ సర్కిల్'.. నేను డిమాండ్ చేసే అత్తను కాదు: అమల అక్కినేని

టాలీవుడ్ సీనియర్ నటి అక్కినేని అమల తన కోడళ్లైన శోభిత ధూళిపాల, జైనబ్‌లతో తనకున్న అనుబంధం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, కోడ‌ళ్ల‌ రాకతో తన ఇంట్లో ఓ ‘గర్ల్స్ సర్కిల్’ ఏర్పడిందని, తన జీవితం కొత్తగా అనిపిస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ కుటుంబానికే పూర్తి సమయం కేటాయిస్తున్న అమల, తన కోడళ్లపై ప్ర‌శంస‌లు కురిపించారు.

"నాకు అద్భుతమైన కోడళ్లు ఉన్నారు. వాళ్లు చాలా మంచి వ్యక్తిత్వం కలవారు" అని అమల తెలిపారు. వాళ్ల పనుల్లో వాళ్లు బిజీగా ఉండటం తనకు సంతోషాన్నిస్తుందని, యువత ఎప్పుడూ ఉత్సాహంగా, సృజనాత్మకంగా ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు. "వాళ్లు తమ పనుల్లో ఉన్నప్పుడు నేను నా పనుల్లో ఉంటాను. సమయం దొరికినప్పుడు అందరం కలిసి సరదాగా గడుపుతాం. నేను డిమాండ్ చేసే అత్తను కాదు, అలాగే డిమాండ్ చేసే భార్యను కూడా కాదు" అని ఆమె నవ్వుతూ చెప్పారు.

తన కుమారులు నాగ చైతన్య, అఖిల్‌ల పెంపకం గురించి మాట్లాడుతూ, వారిద్దరూ అద్భుతమైన యువకులుగా ఎదిగినందుకు గర్వంగా ఉందన్నారు. నాగార్జునకు తన పిల్లలంటే ఎంతో ప్రేమ అని, తాను కూడా తల్లిగా తన బాధ్యతలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదని స్పష్టం చేశారు. మూడేళ్ల క్రితం ‘ఒకే ఒక జీవితం’ చిత్రంలో చివరిసారిగా కనిపించిన అమల, అప్పటి నుంచి కొత్త ప్రాజెక్టులకు అంగీకరించలేదు.

నాగ చైతన్య 2024లో నటి శోభిత ధూళిపాలను వివాహం చేసుకోగా, అఖిల్ అక్కినేని 2025లో ముంబైకి చెందిన ఆర్టిస్ట్ జైనబ్‌ను పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం తన జీవితం చాలా ప్రశాంతంగా, సంతోషంగా సాగిపోతోందని అమల ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

Amala Akkineni
Sobhita Dhulipala
Jainab
Naga Chaitanya
Akhil Akkineni
Tollywood
Girls Circle
Akkineni family
actress
interview

More Telugu News