మీరూ సినిమా మీదే బతుకుతున్నారు.. 'బుక్ మై షో'పై బన్నీ వాసు ఆగ్రహం

  • యాప్‌లో సినిమా రేటింగ్స్‌పై బన్నీ వాసు సూటి ప్రశ్నలు
  • జర్నలిస్టుల రివ్యూలు ఉండగా మీ రేటింగ్స్ ఎందుకని నిలదీత
  • టికెట్ కొనేటప్పుడే రేటింగ్ ఇవ్వడం సరికాదన్న వాసు
ప్రముఖ ఆన్‌లైన్ టికెటింగ్ సంస్థ 'బుక్ మై షో'పై టాలీవుడ్ నిర్మాత బన్నీ వాసు సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్లు అమ్మే యాప్‌లో అసలు రేటింగ్స్ ఎందుకు పెడుతున్నారంటూ ఆయన తీవ్రంగా ప్రశ్నించారు. ఈ విధానం వల్ల సినీ పరిశ్రమకు నష్టం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

వివరాల్లోకి వెళితే, సినిమాలకు సంబంధించి ఇప్పటికే జర్నలిస్టులు విశ్లేషణాత్మక రివ్యూలు ఇస్తున్నారని, అలాంటప్పుడు ప్రేక్షకులు ఇచ్చే రేటింగ్స్‌తో ప్రత్యేకంగా ప్రయోజనం ఏంటని ఆయన నిలదీశారు. టికెట్ కొనుగోలు చేసే సమయంలోనే ఒక సినిమా బాగుంది, బాగాలేదు అని రేటింగ్ ఇవ్వడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు.

"'మీరు కూడా సినిమా మీదే ఆధారపడి వ్యాపారం చేస్తున్నారు కదా? ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి' అంటూ బుక్ మై షో యాజమాన్యాన్ని ఆయన హెచ్చరించారు. ఈ రేటింగ్స్ కారణంగా సినిమా నిర్మాత నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం బన్నీ వాసు చేసిన ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

ఇదిలా ఉండగా, బన్నీ వాసు సమర్పకుడిగా 'మిత్రమండలి' అనే కొత్త సినిమా రాబోతోంది. ఈ చిత్రంలో ప్రియదర్శి, నిహారిక ఎన్ఎమ్, మయూర్, ప్రసాద్ బెహరా, విష్ణు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


More Telugu News