Prashant Kishor: ఎన్నికల్లో పోటీ చేయట్లేదు.. ప్రశాంత్ కిశోర్ సంచలన ప్రకటన

Prashant Kishor Not Contesting Election Focus on Tejashwi Yadav
  • బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ప్రశాంత్ కిశోర్
  • పార్టీ సంస్థాగత పనులకే పరిమితం అవుతానని స్పష్టీకరణ 
  • తేజస్వి యాదవ్ కంచుకోట రాఘోపూర్‌పై పీకే పూర్తిస్థాయి గురి
  • అమేథీలో రాహుల్‌కు పట్టిన గతే తేజస్వికి పడుతుందని వ్యాఖ్య
  • కులం చూసి ఓటేయొద్దంటూ ప్రజలకు ప్రశాంత్ కిశోర్ హితవు 
ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ నాయకుడిగా మారిన జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ (పీకే) సంచలన ప్రకటన చేశారు. నవంబర్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ప్రకటించారు. అయితే, ఆర్జేడీ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ను ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. ముఖ్యంగా తేజస్వి కంచుకోట అయిన రాఘోపూర్ నియోజకవర్గాన్ని లక్ష్యంగా చేసుకుని ఆయన చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి.

"నేను పోటీ చేయను. ఇది పార్టీ తీసుకున్న నిర్ణయం. పార్టీ విస్తృత ప్రయోజనాల కోసం నేను ప్రస్తుతం చేస్తున్న సంస్థాగత పనులనే కొనసాగిస్తాను" అని ప్రశాంత్ కిశోర్ స్పష్టం చేశారు. తేజస్వి యాదవ్‌పై రాఘోపూర్ నుంచి పీకే పోటీ చేస్తారంటూ వస్తున్న ఊహాగానాలకు ఈ ప్రకటనతో తెరపడింది.

అయితే, ఎన్నికల బరిలో లేకపోయినా తన పోరాటం తేజస్విపైనే అని పీకే పరోక్షంగా చాటారు. అక్టోబర్ 11న తేజస్వి యాదవ్ సొంత నియోజకవర్గమైన రాఘోపూర్‌లోనే ఆయన తన ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "అమేథీలో రాహుల్ గాంధీని ఎలా ఓడించారో, రాఘోపూర్‌లో తేజస్వి యాదవ్‌ను కూడా అంతకంటే గట్టిగా ఓడిస్తాం" అని శపథం చేశారు. పాట్నాకు సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ నియోజకవర్గంలో పర్యటించిన పీకేకు స్థానిక మద్దతుదారులు డప్పు వాయిద్యాలతో ఘనస్వాగతం పలికారు.

గ్రామాల్లో పర్యటిస్తూ స్థానిక ప్రజలతో మమేకమైన ప్రశాంత్ కిశోర్, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సరైన రోడ్లు, పాఠశాలలు, కనీస సౌకర్యాలు లేవని ప్రజలు ఫిర్యాదు చేయడంతో, ఆయన స్థానిక ఎమ్మెల్యే పనితీరును తీవ్రంగా విమర్శించారు. "కేవలం కులాన్ని చూసి తప్పుడు వ్యక్తికి ఓటు వేస్తున్నారు. మీ ఎమ్మెల్యే రెండుసార్లు ఉపముఖ్యమంత్రి అయ్యారు. ఎప్పుడైనా మీ సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లగలిగారా?" అని గ్రామస్థులను, ముఖ్యంగా మహిళలను ఉద్దేశించి ప్రశ్నించారు. చాలామంది తేజస్వి యాదవ్‌ను కలవడం కూడా సాధ్యం కాదని చెప్పడం గమనార్హం. ఈసారి తేజస్వి మరో స్థానం నుంచి కూడా పోటీ చేసే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోందని కూడా పీకే పేర్కొన్నారు.
Prashant Kishor
Bihar Election
Tejashwi Yadav
Raghopur
Jan Suraaj Party
Bihar Politics
Election Campaign
Political Strategist
RJD
Bihar Assembly Elections

More Telugu News