ఢిల్లీలోని ఎంబసీ మాదే... తాలిబన్ జెండా ఎగరేసి ప్రకటించిన అఫ్ఘన్ మంత్రి!

Amir Khan Muttaqi Declares Afghan Embassy in Delhi Under Taliban Control
షార్ట్స్‌లో చూడండి
భారత్‌లో పర్యటిస్తున్న ఆఫ్ఘనిస్థాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ సంచలన ప్రకటన చేశారు. న్యూఢిల్లీలోని ఆఫ్ఘన్ రాయబార కార్యాలయం పూర్తిగా తమ నియంత్రణలోనే ఉందని స్పష్టం చేశారు. ఆదివారం ఆయన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తన ముందు, వెనుక ఇస్లామిక్ ఎమిరేట్ (తాలిబన్) జెండాను ఉంచి మాట్లాడటం ప్రాధాన్యం సంతరించుకుంది.

భారత్ ఇంకా అధికారికంగా తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించనప్పటికీ, ఎంబసీలో పాత జెండానే కొనసాగుతున్నప్పటికీ ఆయన ఈ ప్రకటన చేయడం గమనార్హం. "ఇది మా జెండా. దీని నీడలోనే మేం జిహాద్ చేశాం. ఈ ఎంబసీ నూటికి నూరు శాతం మాదే. ఇక్కడ పనిచేస్తున్న వారంతా మాతోనే ఉన్నారు" అని ముత్తాఖీ ఒక ప్రశ్నకు బదులిస్తూ తేల్చి చెప్పారు.

గతంలో మహిళా జర్నలిస్టులను అనుమతించలేదని విమర్శలు రావడంతో, ఈసారి ఆదివారం నాటి సమావేశానికి మహిళా జర్నలిస్టులతో సహా పెద్ద సంఖ్యలో మీడియా ప్రతినిధులను అనుమతించారు.

భారత్‌తో ఫలవంతమైన చర్చలు

భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో జరిపిన చర్చలు ఫలవంతంగా, నిర్మాణాత్మకంగా సాగాయని ముత్తాఖీ తెలిపారు. "వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్యం, విమాన సర్వీసులు, అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించాం. వాణిజ్య వీసాలు, విద్యార్థుల మార్పిడి, ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభించేందుకు భారత్ సంసిద్ధత వ్యక్తం చేసింది" అని ఆయన వివరించారు. కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని అప్‌గ్రేడ్ చేసేందుకు కూడా భారత్ నిర్ణయించిందని ఆయన వెల్లడించారు.

ఢిల్లీ-కాబూల్, ముంబై-కందహార్, అమృత్‌సర్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య కొత్త విమాన సర్వీసులను ప్రారంభించే ప్రణాళికలను ముత్తాఖీ ప్రకటించారు. ఇరు దేశాల మధ్య ఉమ్మడి వాణిజ్య కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు, ఖనిజాలు, వ్యవసాయం, క్రీడల రంగాల్లో సహకారంపై కూడా చర్చలు జరిపినట్లు తెలిపారు. ఆఫ్ఘన్ సరుకుల కోసం అటారీ-వాఘా సరిహద్దును తెరవాలని భారత్‌ను కోరినట్లు ఆయన ధృవీకరించారు.

మహిళల విద్య, పాకిస్థాన్‌పై వ్యాఖ్యలు

మహిళల హక్కులపై అడిగిన ప్రశ్నకు, "ఇస్లాంలో స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా అందరి హక్కులకు రక్షణ ఉంది. మేం విద్యకు వ్యతిరేకం కాదు. విద్య హరామ్ కాదు" అని ముత్తాఖీ అన్నారు. ఆఫ్ఘనిస్థాన్‌లో బాలికలతో సహా కోటి మందికి పైగా విద్యార్థులు పాఠశాలలకు వెళుతున్నారని, కేవలం కొన్ని నిర్దిష్ట ప్రాంతాల్లోనే ఆంక్షలున్నాయని పేర్కొన్నారు.

పాకిస్థాన్ విషయంలో ముత్తాఖీ కఠిన స్వరంతో మాట్లాడారు. "మేం శాంతియుత సంబంధాలనే కోరుకుంటాం. కానీ సంబంధాలు దెబ్బతింటే, భద్రతను ఎలా కాపాడుకోవాలో మాకు కూడా తెలుసు" అని హెచ్చరించారు. ఆఫ్ఘనిస్థాన్‌ను నిందించే బదులు పాకిస్థాన్ తమ చెక్‌పోస్టులను అదుపులో పెట్టుకోవాలని సూచించారు. తెహ్రీక్-ఏ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) ఉగ్రవాదులు తమ గడ్డపై లేరని ఆయన స్పష్టం చేశారు.
Go Back to Shorts
Amir Khan Muttaqi
Afghanistan
Taliban
India
Embassy
S Jaishankar
Trade
Women education
Pakistan
Kabul

More Telugu News