: వైట్ హౌస్ కు కౌంటర్ ఇచ్చిన నోబెల్ కమిటీ

  • చేసిన పనులను పరిశీలించాకే ప్రైజ్ ప్రకటిస్తామని చురకలు
  • నోబెల్ శాంతి బహుమతి ప్రకటనపై వైట్ హౌస్ విమర్శ
  • ట్రంప్ కు ప్రకటించకపోవడంపై అక్కసు
నోబెల్ శాంతి బహుమతిని ఈ ఏడాదికి వెనెజువెలా ప్రతిపక్ష నేత మరియా కొరీనా మచాడోకు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ బహుమతిపై ఆశలు పెంచుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు నిరాశ తప్పలేదు. ఈ విషయంలో అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ఓ అడుగు ముందుకు వేసి ట్రంప్ కు శాంతి బహుమతి వచ్చినట్లు ‘మిస్టర్ పీస్ ప్రెసిడెంట్’ అంటూ ప్రచారం కూడా చేసింది. తీరా నోబెల్ దక్కకపోవడంతో అక్కసు పెంచుకున్న వైట్ హౌస్.. నోబెల్ కమిటీపై విమర్శలు చేసింది. బహుమతి ప్రకటనను రాజకీయం చేశారని ఆరోపించింది. ఈ విమర్శలపై నోబెల్ కమిటీ తాజాగా స్పందించింది.

‘‘నోబెల్ అవార్డుల ఎంపికకు ముందు అన్నిరకాలుగా పరిశీలన జరుపుతాం. అవార్డు అందుకోవడానికి అన్ని అర్హతలు ఉన్నాయని నిర్దారించుకున్న తర్వాతే ఎంపిక చేస్తాం. నోబెల్ ప్రైజ్ కు ఎంపికలో ప్రధానంగా ‘అభ్యర్థి చేసిన పనుల’ ను పరిగణనలోకి తీసుకుని, ఆల్ఫ్రెడ్ నోబెల్ వీలునామా ప్రకారమే అభ్యర్థులను ఎంపిక చేస్తామని పరోక్షంగా వైట్ హౌస్ కు చురకలు వేసింది.

నోబెల్ పీస్ ప్రైజ్ ఎంపికలోనూ ఈ నియమాలనే పాటించామని స్పష్టం చేసింది. ఏటా నోబెల్ శాంతి బహుమతి కోసం తమకు వేలాదిగా దరఖాస్తులు వస్తాయని కమిటీ తెలిపింది. వాటన్నింటినీ పరిశీలించి నిజంగా శాంతి కోసం కృషి చేసిన వారినే బహుమతి కోసం ఎంపిక చేస్తామని, ఇందులో ఇతర అంశాలు ఏవీ ప్రభావం చూపబోవని స్పష్టం చేసింది.

More Telugu News