200 సీసీ కెమెరాలున్నా చిక్కకుండా ఇంజినీరింగ్ కాలేజీలో దొంగతనం!

  • అబ్దుల్లాపుర్ మెట్ బ్రిలియంట్ ఇంజినీరింగ్ కళాశాలలో ఘటన 
  • రూ.1.07 కోట్ల నగదు అపహరణ
  • సీసీ కెమెరాల డివీఆర్ మాయం చేసిన దుండగులు
దాదాపు 200 సీసీ కెమెరాలు ఉన్న ఇంజనీరింగ్ కళాశాలలో ఎటువంటి ఆధారం చిక్కకుండా భారీ చోరీ జరగడం తీవ్ర సంచలనం కలిగించింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపుర్‌మెట్‌లో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి చెందిన బ్రిలియంట్ ఇంజినీరింగ్ కళాశాలలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కళాశాలకు చెందిన రూ.1.07 కోట్ల నగదును సిబ్బంది కార్యాలయంలోని బీరువాలో ఉంచి తాళం వేసి వెళ్లారు. అయితే నిన్న ఉదయం కళాశాల ఏవో కేశినేని కుమార్, ప్రిన్సిపల్ ఉలిగండ్ల వీరన్న వచ్చేసరికి తలుపు తాళం పగిలి ఉండటం గమనించి లోపలికి వెళ్లి చూడగా బీరువాలోని నగదు మాయమైందని గుర్తించారు.

వెంటనే ప్రిన్సిపల్ అబ్దుల్లాపుర్‌మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు, ఎల్బీనగర్ డీసీపీ అనూరాధ, క్రైం డీసీపీ అరవింద్, వనస్థలిపురం ఏసీపీ కాశిరెడ్డి, అబ్దుల్లాపుర్‌మెట్ ఇన్స్‌పెక్టర్ అశోకరెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.

కళాశాల ఆవరణలో దాదాపు 500 సీసీ కెమెరాలు ఉండగా నిందితుడిని సులువుగా పట్టుకోవచ్చని పోలీసులు భావించారు. అయితే సీసీ కెమెరాలను పరిశీలించగా, కళాశాల కెమెరాలకు సంబంధించిన డీవీఆర్ మాయమైనట్లు పోలీసులు గుర్తించారు. దీంతో నిందితులు చాలా తెలివిగా చోరీకి సంబంధించిన ఆధారాలు చెరిపివేసే ప్రయత్నం చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ చోరీ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. కళాశాల కార్యాలయంలో నగదు ఉన్న విషయం ముందుగా తెలిసినవారే ఈ చోరీకి పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. 


More Telugu News