Neha Reddy: విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ

Neha Reddy Setback in High Court Regarding CRZ Violations
  • అక్రమ గోడ కూల్చివేత ఖర్చు రూ. 48.21 లక్షలు చెల్లించాలని ఆదేశం
  • పర్యావరణ నష్టం కింద రూ. 17.46 కోట్ల పరిహారంపై స్పందించాలని నోటీసులు
  • భీమిలిలో సీఆర్‌జెడ్ నిబంధనల ఉల్లంఘనపై విచారణ చేపట్టిన ధర్మాసనం
  • జనసేన కార్పొరేటర్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ
  • కేసు తదుపరి విచారణను అక్టోబర్ 16వ తేదీకి వాయిదా
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డితో పాటు ఆమెకు చెందిన అవ్యాన్ రియల్టర్స్ ఎల్ఎల్‌పీ సంస్థకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. విశాఖపట్నం జిల్లా భీమునిపట్నంలో సముద్ర తీర ప్రాంత నిబంధనలను (సీఆర్‌జెడ్) పూర్తిగా ఉల్లంఘించి నిర్మించిన భారీ కాంక్రీట్ గోడ కూల్చివేతకు అయిన ఖర్చును ఆ సంస్థ నుంచే వసూలు చేయాలని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ కూల్చివేతకు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ)కి అయిన రూ. 48.21 లక్షల మొత్తాన్ని తదుపరి విచారణలోగా డిపాజిట్ చేయాలని నేహారెడ్డిని ఆదేశించింది.

గురువారం ఈ కేసుకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. విశాఖకు చెందిన జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఈ అక్రమ నిర్మాణంపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. విచారణ సందర్భంగా, అక్రమ కాంక్రీట్ నిర్మాణం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లిందని కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నిర్ధారించింది. ఈ నష్టానికి గాను సంబంధిత కంపెనీ నుంచి రూ. 17.46 కోట్లు ఎందుకు వసూలు చేయకూడదో వివరణ ఇవ్వాలని అవ్యాన్ రియల్టర్స్ సంస్థకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఈ రెండు అంశాలపై అక్టోబర్ 16న జరగనున్న తదుపరి విచారణ నాటికి స్పందన తెలియజేయాలని కోర్టు స్పష్టం చేసింది.

గతంలో ఇదే వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు, నేహారెడ్డి కంపెనీపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఏపీ కోస్టల్ జోన్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఏపీసీజెడ్‌ఎంఏ) మెంబర్ సెక్రెటరీని ఆదేశించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా, అక్రమ నిర్మాణాల వల్ల పర్యావరణానికి జరిగిన నష్టాన్ని కచ్చితంగా అంచనా వేయడానికి నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు కూడా సూచించింది.

ఈ కేసుతో పాటే, భీమిలి తీరంలో సీఆర్‌జెడ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన మరో నాలుగు రెస్ట్రోబార్ల తొలగింపునకు సంబంధించి కూడా విచారణ జరిగింది. గ్రామాభివృద్ధి సేవా సంఘం అధ్యక్షుడు గంటా నూకరాజు దాఖలు చేసిన మరో ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో, ఈ అక్రమ రెస్ట్రోబార్లను తొలగించి, సహజ ఆవాసాలను పునరుద్ధరించాలని కోరారు. దీనిపై కూడా స్పందన తెలియజేయాలని ఆయా రెస్ట్రోబార్ల యాజమాన్యాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతానికి ఈ కేసులన్నింటిపై తదుపరి విచారణను అక్టోబర్ 16వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.
Neha Reddy
Vijayasai Reddy
Avyaan Realtors
Andhra Pradesh High Court
CRZ violations
Bheemunipatnam
Visakhapatnam
GVMC
Environmental damage
Ganta Nookaraju

More Telugu News