: మాయావతి బంగ్లాను కోరిన కేజ్రీవాల్... చివరకు ఏ బంగ్లా కేటాయించారంటే..!

  • ఏడాది నిరీక్షణ తర్వాత అరవింద్ కేజ్రీవాల్‌కు అధికారిక నివాసం
  • ఢిల్లీలోని లోధీ ఎస్టేట్‌లో టైప్-VII బంగ్లా కేటాయించిన కేంద్రం
  • శశి థరూర్, ప్రియాంక గాంధీలకు సమీపంలో నివాసం
ముఖ్యమంత్రి అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన దాదాపు ఏడాది తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు కేంద్ర ప్రభుత్వం కొత్త బంగ్లాను కేటాయించింది. ఢిల్లీలోని అత్యంత ప్రముఖమైన లోధీ ఎస్టేట్‌లో ఆయనకు టైప్-VII బంగ్లాను కేటాయిస్తున్నట్లు వెల్లడించింది. గుర్తింపు పొందిన జాతీయ పార్టీ అధ్యక్షుడిగా తనకు నివాసం కేటాయించాలని కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.

కేజ్రీవాల్‌కు 95, లోధీ ఎస్టేట్‌లోని బంగ్లాను కేటాయించారు. ఆయన ఈ కొత్త ఇంటిని సందర్శించి పరిశీలించారు. సుమారు 5,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే ఈ టైప్-VII బంగ్లాలో నాలుగు బెడ్‌రూమ్‌లు, విశాలమైన లాన్‌లు, గ్యారేజ్, ఆఫీసు స్థలంతో పాటు మూడు సర్వెంట్ క్వార్టర్లు ఉంటాయి. దీంతో కేజ్రీవాల్ అధికారిక నివాస సమస్యకు ఒక ముగింపు లభించినట్లయింది.

ఈ కొత్త కేటాయింపుతో కేజ్రీవాల్.. కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్‌కు పొరుగువారు కానున్నారు. ఆయన 97వ నెంబర్ బంగ్లాలో నివాసం ఉంటున్నారు. సమీపంలోనే ఆర్జేడీ నేత మిసా భారతి, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ బంగ్లాలు కూడా ఉన్నాయి. గతంలో మాయావతి ఉపయోగించిన 35, లోధీ ఎస్టేట్ బంగ్లాను తమకు కేటాయించాలని ఆప్ కోరినప్పటికీ, దానిని ఇప్పటికే కేంద్ర సహాయ మంత్రి పంకజ్ చౌదరికి కేటాయించారు.

2024 సెప్టెంబర్ 17న ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కేజ్రీవాల్, నవంబర్ 4న 6, ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్‌లోని అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు. అప్పటి నుంచి ఆయనకు అధికారిక శాశ్వత నివాసం లేకుండా పోయింది. తాత్కాలికంగా పంజాబ్ నుంచి ఆప్ రాజ్యసభ ఎంపీ అశోక్ మిట్టల్ నివాసంలో (5, ఫిరోజ్‌షా రోడ్) ఉంటున్నారు. జాతీయ పార్టీ అధ్యక్షులకు పది రోజుల్లోగా అధికారిక వసతి కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం గతంలో ఢిల్లీ హైకోర్టుకు హామీ ఇచ్చింది.

ఇదిలా ఉండగా, కేజ్రీవాల్ గతంలో నివాసం ఉన్న 6, ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్ బంగ్లాపై అవినీతి ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ ఇంటిని ఇప్పుడు ఓ కేఫ్‌టేరియాతో కూడిన రాష్ట్ర అతిథి గృహంగా మార్చాలని ఢిల్లీ ప్రభుత్వం యోచిస్తోంది. 

More Telugu News