Harish Rao: జేబులో కత్తెర... కేసీఆర్ పనులకు రిబ్బన్ కటింగులు..!: రేవంత్‌పై హరీశ్ రావు సెటైర్లు

Harish Rao Slams Revanth as Cutting Master Over KCR Projects
  • సీఎం కాదు, కటింగ్ మాస్టర్ అంటూ రేవంత్‌పై హరీశ్ రావు విమర్శలు
  • కేసీఆర్ పనులకు రిబ్బన్లు కట్ చేయడమే రేవంత్ పని అని ఎద్దేవా
  • మల్లన్నసాగర్ నుంచి నీళ్లు ఎలా తీసుకెళ్తున్నారని ప్రభుత్వానికి ప్రశ్న
  • ఆరు గ్యారెంటీల హామీ విఫలం అయిందని విమర్శ
  • అక్రమ కేసులు పెడితే పింక్ బుక్కులో రాసుకుంటామని పోలీసులకు వార్నింగ్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాదని, ఆయనో ‘కటింగ్ మాస్టర్’ అని ఘాటుగా విమర్శించారు. జేబులో ఎప్పుడూ కత్తెర పెట్టుకుని తిరుగుతూ, కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులకు రిబ్బన్లు కత్తిరించడమే పనిగా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ఒకవేళ రిబ్బన్లు కత్తిరించకపోతే, కేసీఆర్ అమలు చేసిన పథకాలను కత్తిరించడమే రేవంత్ పని అని వ్యాఖ్యానించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని పదేపదే చెబుతున్న సీఎం రేవంత్, అదే ప్రాజెక్టులో భాగమైన మల్లన్నసాగర్ నుంచి హైదరాబాద్ నగరానికి నీటిని ఎలా తరలిస్తున్నారని హరీశ్ సూటిగా ప్రశ్నించారు. "కేసీఆర్ చెమటోడ్చి నిర్మించిన ప్రాజెక్టు కాళేశ్వరం. మరి మల్లన్నసాగర్‌ను మీ నాన్న కట్టారని నీళ్లు తీసుకెళుతున్నారా?" అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని చెప్పినా ప్రజలు ఇక నమ్మే స్థితిలో లేరని ఆయన అన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలనను గాలికొదిలేసిందని, ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించడంలో విఫలమైందని విమర్శించారు. కొత్తగా పింఛన్లు ఇవ్వకపోగా, ఉన్న రెండు లక్షల పింఛన్లను తొలగించారని ఆరోపించారు. కల్యాణలక్ష్మి పథకం కింద 8 లక్షల తులాల బంగారం లబ్ధిదారులకు బాకీ పడ్డారని తెలిపారు. రెండు లక్షల ఉద్యోగాల హామీ ఇచ్చి 20 వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదని, ఎన్నికల ముందు రజినీకాంత్‌లా కనిపించిన రేవంత్, అధికారంలోకి వచ్చాక ‘గజినీకాంత్’లా హామీలను మర్చిపోయారని సెటైర్లు వేశారు. రైతులకు కనీసం యూరియా సరఫరా చేయలేని చేతకాని ప్రభుత్వమని దుయ్యబట్టారు.

ఈ సందర్భంగా బీజేపీ ఎంపీలపైనా హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. "వడ్లకు ఒక నీతి, గోధుమలకు మరో నీతా?" అని కేంద్రాన్ని ప్రశ్నించే దమ్ము తెలంగాణ బీజేపీ ఎంపీలకు ఉందా? అని సవాల్ విసిరారు. రాష్ట్రంలో తమ పార్టీ కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తే, వాటన్నింటినీ పింక్ బుక్కులో రాసిపెట్టుకుంటున్నామని, బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే వారి సంగతి చూస్తామని హెచ్చరించారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అన్ని జిల్లాల్లోనూ ఘన విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 
Harish Rao
Revanth Reddy
KCR
Telangana politics
BRS
Congress party
Kaleshwaram project
Mallannasagar
Telangana government
Farmers welfare

More Telugu News