అతడు గంభీర్ కు ఇష్టమైన ఆటగాడు... అందుకే జట్టులో కొనసాగుతున్నాడు: శ్రీకాంత్

  • ఆస్ట్రేలియా పర్యటనకు భారత వన్డే, టీ20 జట్ల ప్రకటన
  • వన్డే కెప్టెన్‌గా రోహిత్ స్థానంలో శుభ్‌మన్ గిల్ ఎంపిక
  • జట్టు సెలక్షన్‌పై మాజీ క్రికెటర్ శ్రీకాంత్ తీవ్ర విమర్శలు
  • గంభీర్ వల్లే హర్షిత్ రాణాకు చోటు దక్కిందని ఆరోపణ
  • నితీశ్ కుమార్ రెడ్డి ఎంపికను కూడా తప్పుబట్టిన శ్రీకాంత్
ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత క్రికెట్ జట్లను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించిన వెంటనే వివాదం రాజుకుంది. జట్టు ఎంపికపై భారత మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ (క్రిష్) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. ముఖ్యంగా, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు సన్నిహితుడు కావడం వల్లే యువ ఆటగాడు హర్షిత్ రాణాకు జట్టులో చోటు దక్కిందంటూ శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.

ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్‌ల కోసం ప్రకటించిన జట్లలో హర్షిత్ రాణా ఒక్కడే రెండు ఫార్మాట్లలోనూ స్థానం సంపాదించాడు. ఈ ఎంపికను ఉద్దేశిస్తూ శ్రీకాంత్ ఘాటుగా స్పందించాడు. "హర్షిత్ రాణా భారత జట్టులో శాశ్వత సభ్యుడు. ఎందుకంటే అతడు గౌతమ్ గంభీర్‌కు ఇష్టమైన వ్యక్తి. అతడికి గంభీర్ చాలా ప్రాధాన్యత ఇస్తాడు. అందుకే, శుభ్‌మన్ గిల్ తర్వాత జాబితాలో కచ్చితంగా హర్షిత్ పేరే ఉంటుంది" అంటూ ఎంపిక తీరును ఎండగట్టాడు.

శ్రీకాంత్ విమర్శలు ఇక్కడితో ఆగలేదు. ఆల్‌రౌండర్ కోటాలో హార్దిక్ పాండ్యా స్థానంలో నితీశ్ కుమార్ రెడ్డిని ఎంపిక చేయడాన్ని కూడా శ్రీకాంవత్ ప్రశ్నించాడు. "నితీశ్ మెరుగైన ప్రత్యామ్నాయం కాదు. మనకు రవీంద్ర జడేజా రూపంలో అత్యుత్తమ ఆల్‌రౌండర్ ఉన్నాడు. నితీశ్‌ను తీసుకుంటే కేవలం బ్యాటర్‌గానే తీసుకోవాలి. అతడు బౌలింగ్ కూడా చాలా తక్కువగా వేస్తాడు" అని అభిప్రాయపడ్డాడు.

ఇదిలా ఉండగా, అక్టోబర్ 19 నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటనలో కొన్ని కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. వన్డే జట్టుకు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ స్థానంలో శుభ్‌మన్ గిల్‌ను సారథిగా నియమించారు. అయితే, సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ వన్డే సిరీస్‌కు ఎంపిక కావడం గమనార్హం. ప్రస్తుతం శ్రీకాంత్ చేసిన ఈ వ్యాఖ్యలు జట్టు ఎంపిక ప్రక్రియపై కొత్త చర్చకు దారితీశాయి.


More Telugu News