Jagan Mohan Reddy: ఇలా ప్రజల ఆరోగ్యంతో చెలగాటం న్యాయమేనా చంద్రబాబు గారూ?: జగన్

ఆంధ్రప్రదేశ్‌లో అధికార టీడీపీ నేతృత్వంలో వ్యవస్థీకృతంగా నకిలీ మద్యం దందా జరుగుతోందని వైసీపీ అధినేత జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మద్యం సిండికేట్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారి, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని, ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొడుతున్నారని ఒక ప్రకటనలో విమర్శించారు.

అన్నమయ్య జిల్లా ములకలచెరువులో టీడీపీ నేతలు నిర్వహిస్తున్న కల్తీ మద్యం తయారీ ఫ్యాక్టరీ పట్టుబడటమే రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలకు నిదర్శనమని జగన్ పేర్కొన్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాలను ఒక వ్యూహం ప్రకారం రద్దు చేసి, ఆ స్థానంలో టీడీపీ నేతల సిండికేట్లకు అప్పగించారని ఆరోపించారు. "మద్యం దుకాణాలు, బెల్టు షాపులు, అక్రమ పర్మిట్ రూమ్‌లు అన్నీ టీడీపీ నేతలవే. వారే నకిలీ మద్యం తయారు చేసి, వారి దుకాణాల ద్వారా అమ్మి, అక్రమ సంపాదనను పంచుకుంటున్నారు" అని జగన్ విమర్శించారు.

మద్యం అమ్మకాలపై కాగ్ నివేదికలను ప్రస్తావిస్తూ జగన్ గణాంకాలను వెల్లడించారు. 2024-25 ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం అమ్మకాల ద్వారా రూ. 6,782.21 కోట్ల ఎక్సైజ్ ఆదాయం రాగా, 2025-26లో టీడీపీ ప్రభుత్వం వచ్చాక విచ్చలవిడిగా అమ్మకాలు పెంచినా కేవలం రూ. 6,992.77 కోట్లు మాత్రమే వచ్చిందని తెలిపారు. ఇది కేవలం 3.10 శాతం పెరుగుదల మాత్రమేనని, సహజంగా రావాల్సిన 10 శాతం వృద్ధి కూడా లేకపోవడం వెనుక భారీ దోపిడీ దాగి ఉందని ఆరోపించారు. ప్రభుత్వానికి చేరాల్సిన ఆదాయమంతా సిండికేట్ల రూపంలో టీడీపీ నేతల జేబుల్లోకి వెళుతోందని ఆయన పేర్కొన్నారు.

ములకలచెరువు ఘటనలో కేసును నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని జగన్ ఆరోపించారు. ఈ వ్యవహారం వెనుక ఉన్న జిల్లా స్థాయి టీడీపీ ఇన్‌ఛార్జిని కాపాడేందుకు, విదేశాల్లో ఉన్న వ్యక్తిపై నెపం నెట్టి కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాలతోనే రాత్రికి రాత్రే కేసును మార్చేశారని, ఈ దందాకు ప్రభుత్వ పూర్తి సహకారం ఉందని ఆరోపించారు. సొంత ఆదాయం కోసం ప్రజల ప్రాణాలను పణంగా పెట్టడం న్యాయమేనా అని జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
Jagan Mohan Reddy
YS Jagan
Andhra Pradesh
TDP
Chandrababu Naidu
Fake Liquor
Excise Revenue
Mullakalacheruvu
Liquor Syndicate
AP Politics

More Telugu News