దేశం కోసం అవసరమైతే మేం సరిహద్దులు దాటుతాం: రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

  • జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న రాజ్‌నాథ్
  • దేశానికి ముప్పు పొంచి ఉంటే ఎలాంటి నిర్ణయాత్మక చర్యలకైనా దిగుతామని హెచ్చరిక
  • మతం ఆధారంగా ఆపరేషన్ సిందూర్ నిర్వహించలేదని వ్యాఖ్య
భారత ప్రజల రక్షణ, దేశ సమగ్రత కోసం ఎన్డీయే ప్రభుత్వం సరిహద్దులు దాటేందుకు కూడా సిద్ధంగా ఉందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఢిల్లీలో జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాకిస్థాన్‌కు గట్టి హెచ్చరిక జారీ చేశారు.

దేశానికి ముప్పు వాటిల్లితే ఎలాంటి నిర్ణయాత్మక చర్యలకైనా వెనుకాడబోమని 'ఆపరేషన్ సిందూర్' ద్వారా నిరూపించామని ఆయన అన్నారు. 2016 సర్జికల్ స్ట్రైక్, 2019 బాలాకోట్ వైమానిక దాడులను కూడా ఆయన ఈ సందర్భంగా ఉదహరించారు.

పహల్గామ్‌లో ఉగ్రవాదులు పౌరులను వారి మతం ఆధారంగా కాల్చి చంపారని, అయితే భారత్ మాత్రం మతం కోణంలో 'ఆపరేషన్ సిందూర్' చేపట్టలేదని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదులను, వారి స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని తెలిపారు. పాకిస్థాన్ లేదా పీవోకేలో ఏ సైనిక లేదా పౌర సంస్థలపైనా భారత్ దాడి చేయలేదని గుర్తు చేశారు.


More Telugu News