Dasara festival: దసరా ధూమ్ ధామ్.. తెలంగాణలో మూడ్రోజుల్లో రూ. 697 కోట్లు తాగేశారు!

రాష్ట్రంలో దసరా పండుగ సందర్భంగా మద్యం విక్రయాలు సరికొత్త రికార్డులు సృష్టించాయి. పండగకు తోడు గాంధీ జయంతి కారణంగా దుకాణాలకు సెలవు ప్రకటించడంతో, మందుబాబులు ముందుగానే భారీగా కొనుగోళ్లు చేపట్టారు. ఫలితంగా కేవలం మూడు రోజుల్లోనే దాదాపు రూ.700 కోట్ల విలువైన మద్యం అమ్ముడైంది.

సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 1 వరకు రాష్ట్రంలో మద్యం అమ్మకాలు అనూహ్యంగా పెరిగాయి. సెప్టెంబర్ 29న రూ.278 కోట్లు, 30వ తేదీన రూ.333 కోట్ల అమ్మకాలు జరిగాయి. అక్టోబర్ 1న కూడా రూ.86.23 కోట్ల విలువైన మద్యాన్ని వినియోగదారులు కొనుగోలు చేశారు. మొత్తంగా ఈ మూడు రోజుల్లోనే రూ.697.23 కోట్ల విక్రయాలు నమోదయ్యాయి. ఈ గణాంకాలు కేవలం డిపోల నుంచి దుకాణాలకు చేరిన సరుకుకు సంబంధించినవి మాత్రమేనని, దుకాణాల్లో ఇప్పటికే ఉన్న నిల్వలను కూడా కలిపితే అసలు అమ్మకాలు ఇంకా ఎక్కువ ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

మొత్తం సెప్టెంబర్ నెలను పరిశీలిస్తే, ఈ ఏడాది రూ.3,048 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. గత ఏడాది ఇదే నెలలో నమోదైన రూ.2,839 కోట్లతో పోలిస్తే ఇది సుమారు 7 శాతం అధికం. అయితే, పండగ ముందు మూడు రోజుల అమ్మకాల్లో మాత్రం ఏకంగా 50 శాతానికి పైగా వృద్ధి కనిపించడం గమనార్హం.

బీర్లకు తగ్గిన గిరాకీ
ఈసారి మద్యం విక్రయాల్లో ఆసక్తికరమైన మార్పు కనిపించింది. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (ఐఎంఎల్) అమ్మకాలు పెరగగా, బీర్ల విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. గత ఏడాది సెప్టెంబర్‌లో 28.81 లక్షల ఐఎంఎల్ కేసులు అమ్ముడవగా, ఈసారి ఆ సంఖ్య 29.92 లక్షల కేసులకు పెరిగింది. మరోవైపు, గత ఏడాది 39.71 లక్షల కేసుల బీర్లు అమ్ముడైతే, ఈసారి ఆ సంఖ్య 36.46 లక్షల కేసులకు పడిపోయింది. రాష్ట్రంలో చల్లటి వాతావరణం, వర్షాలు, బీర్ల ధరలు పెరగడం వంటి కారణాల వల్ల వాటికి డిమాండ్ తగ్గిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Dasara festival
liquor sales
alcohol sales
Telangana
Gandhi Jayanti
IML liquor
beer sales decline
Indian Made Foreign Liquor
Dasara sales
liquor consumption

More Telugu News