మోదీ వర్కింగ్ స్టైల్‌పై డచ్ టెక్ దిగ్గజం ప్రశంసలు.. యూరప్ నేతలకు చురకలు!

  • ప్రధాని మోదీ పనితీరుపై డచ్ సెమీకండక్టర్ దిగ్గజం ఏఎస్ఎంఎల్ ప్రశంసలు
  • 'ఇంకా ఏం చేస్తే బాగుంటుందో చెప్పండి' అని మోదీ అడిగారన్న కంపెనీ ఎగ్జిక్యూటివ్
  • మోదీని కలవడం చాలా సులభం, యూరప్ నేతలను కలవడం కష్టమంటూ వ్యాఖ్య
  • పెట్టుబడులు పెట్టే కంపెనీలతో మోదీ నేరుగా చర్చిస్తారని కితాబు
భారత ప్రధాని నరేంద్ర మోదీ పనితీరు, వ్యాపార అనుకూల వైఖరిపై ప్రపంచ ప్రఖ్యాత సెమీకండక్టర్ల తయారీ సంస్థ ఏఎస్ఎంఎల్ ప్రశంసల వర్షం కురిపించింది. పెట్టుబడుల విషయంలో ప్రధాని మోదీ చాలా చొరవ తీసుకుంటారని, కంపెనీల అభిప్రాయాలకు ఎంతో విలువ ఇస్తారని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ ఫ్రాంక్ హీమ్స్‌కెర్క్ కొనియాడారు.

బ్రస్సెల్స్‌లో జరిగిన ఓ వాణిజ్య సదస్సులో ఆయన మాట్లాడుతూ తమ కంపెనీ సీఈవో క్రిస్టోఫ్ ఫౌకేతో ప్రధాని మోదీ దాదాపు రెండు గంటల పాటు సమావేశమయ్యారని గుర్తుచేశారు. ఆ సమావేశంలో మోదీ కేవలం తాము చెప్పింది వినడమే కాకుండా, "మీరు చాలా స్నేహపూర్వకంగా మాట్లాడుతున్నారు. మేం ఇంకా మెరుగ్గా ఏం చేయాలో సూటిగా చెప్పండి" అని అడిగారని హీమ్స్‌కెర్క్ వెల్లడించారు. మోదీ నిక్కచ్చి వైఖరి తమను ఆకట్టుకుందని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా యూరప్ దేశాల నేతల పనితీరును ఆయన పరోక్షంగా విమర్శించారు. "యూరప్‌లో ఒక కమిషనర్‌తో భేటీ అవడం కంటే అమెరికాలోని వైట్‌హౌస్‌లో ఓ సీనియర్ అధికారిని కలవడమే చాలా సులభం" అని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే, పెట్టుబడులు పెట్టే కంపెనీలతో నేరుగా కూర్చుని మాట్లాడటం ఎలాగో యూరప్ రాజకీయ నాయకులు ప్రధాని మోదీని చూసి నేర్చుకోవాలని ఆయన సూచించారు.

భారత్ సెమీకండక్టర్ల తయారీ రంగంలో విప్లవాత్మక అడుగులు వేస్తున్న తరుణంలో ఏఎస్ఎంఎల్ వంటి దిగ్గజ సంస్థ నుంచి ఈ ప్రశంసలు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే 'మేడ్ ఇన్ ఇండియా'లో భాగంగా ఇస్రో తయారుచేసిన 'విక్రమ్' చిప్‌ను ప్రధానికి అందించారు. ఈ ఏడాది చివరి నాటికి దేశీయంగా తయారైన చిప్‌లు మార్కెట్లోకి వస్తాయని మోదీ ప్రకటించారు. 2021లో కేంద్ర ప్రభుత్వం రూ. 76,000 కోట్లతో 'ఇండియా సెమీకండక్టర్ మిషన్' ప్రారంభించిన విషయం తెలిసిందే.


More Telugu News