కాకినాడలో ప్రేమించిన బాలికను బ్లేడ్ తో గొంతుకోసి చంపేసిన యువకుడు

  • ఆపై రైలుకిందపడి ఆత్మహత్య
  • కాకినాడ జిల్లా పనసపాడులో ఘోరం
  • మంగళవారం అర్ధరాత్రి గ్రామంలోని ఆలయం వద్ద ఘటన
ప్రేమించిన బాలికను దారుణంగా హతమార్చిన ఓ యువకుడు ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన కాకినాడ జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని గొల్లప్రోలు మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక, అదే గ్రామానికి చెందిన అశోక్ అనే యువకుడు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.

ఏం జరిగిందో ఏమో కానీ మంగళవారం అర్ధరాత్రి అశోక్ ఆ బాలికను పనసపాడులోని సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం వద్దకు తీసుకు వెళ్లాడు. వెంట తెచ్చుకున్న బ్లేడ్ తో బాలిక గొంతుకోసి హత్య చేశాడు. అనంతరం వేట్లపాలెం సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


More Telugu News