ఆధార్ కార్డు చూపించమని అడిగినందుకు బస్సు కింద పడుకొని మహిళ హంగామా

  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘటన
  • మద్యం మత్తులో బస్సు ఎక్కిన మహిళ
  • ఆధార్ కార్డు లేకున్న టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్
  • పోలీసులకు సమాచారం ఇచ్చిన ఆర్టీసీ సిబ్బంది
ఉచిత బస్సు ప్రయాణం కోసం ఆధార్ కార్డు చూపించాలని కండక్టర్ అడగడంతో ఓ మహిళ బస్సు కింద పడుకొని హంగామా సృష్టించింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చుంచుపల్లి మండలం, విద్యానగర్‌లో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులను పిలిపించి, మందలించి పంపించివేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, లక్ష్మీదేవిపల్లి మండలం, శేషగిరినగర్‌కు చెందిన బోయ చిట్టి మద్యం సేవించి కొత్తగూడెం బస్టాండ్‌లో ఖమ్మం వెళ్లే బస్సు ఎక్కింది. టిక్కెట్ కొరకు కండక్టర్ ఆమెను ఆధార్ కార్డు చూపించమని కోరగా, తన వద్ద ఆధార్ లేదని చెప్పింది. కండక్టర్‌తో వాగ్వాదానికి దిగింది. దీంతో ఆమెను విద్యానగర్‌లో బస్సు దింపేశారు.

బస్సు నుంచి తనను దింపడంపై ఆగ్రహించిన ఆ మహిళ, బస్సు కింద పడుకుని హంగామా చేసింది. ఆధార్ కార్డు లేకపోయినా తనకు ఉచిత టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రభస చేసింది. దీంతో ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆమెకు నచ్చజెప్పి, స్టేషన్‌కు తరలించారు.


More Telugu News