భయపెడుతూనే నవ్విస్తున్న ప్రభాస్.. 'ది రాజా సాబ్' ట్రైలర్ వచ్చేసింది!

  • ప్రభాస్ 'ది రాజా సాబ్' సినిమా ట్రైలర్ విడుదల
  • వచ్చే ఏడాది జనవరి 9న సినిమా రిలీజ్
  • హారర్, కామెడీ, యాక్షన్ మేళవింపుగా చిత్రం
  • తలకిందులుగా సింహాసనంపై షాకింగ్ లుక్‌లో ప్రభాస్
  • కీలక పాత్రలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్
  • మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణం
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులకు దసరా ముందే అదిరిపోయే ట్రీట్ లభించింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ది రాజా సాబ్' సినిమా నుంచి ట్రైలర్‌ను సోమవారం విడుదల చేశారు. దీంతో పాటు, ముందుగా ప్రకటించిన విడుదల తేదీని కూడా మారుస్తున్నట్లు అధికారికంగా తెలిపారు. దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ హారర్ థ్రిల్లర్ మూవీ వచ్చే ఏడాది జనవరి 9న రిలీజ్ అవుతుందని నేటి అప్ డేట్ లో వెల్లడించారు.

ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా, ఆసక్తికరంగా సాగింది. గత జన్మ గురించి తెలుసుకోవడానికి హిప్నాటిజం చేయించుకుంటున్న ప్రభాస్ సన్నివేశంతో ట్రైలర్ మొదలవుతుంది. ఆ చీకటి ప్రపంచంలోకి వెళ్లగానే ఏదో వింత జీవి ఉన్నట్లు గ్రహించి ఒక్కసారిగా బయటకు వస్తాడు. ఈ సినిమాలో కేవలం భయపెట్టే అంశాలే కాకుండా, కామెడీకి కూడా పెద్ద పీట వేసినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఒక సన్నివేశంలో దయ్యాన్ని చూసి, "మా తాతయ్య.. పరిచయం చేస్తాను ఉండండి" అని ప్రభాస్ అనడం, దానికి తోటి నటుడు అయోమయంగా చూస్తుంటే.. "పరిగెత్తడానికి ఇంకెందుకు వెయిటింగ్?" అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ నవ్వులు పూయిస్తోంది.

ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఒక శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. "అతను వీధుల్లో మంత్రాలు వేసే మాంత్రికుడు కాదు. అతను ఒక సైకియాట్రిస్ట్, హిప్నాటిస్ట్, ఎక్సార్సిస్ట్. మన మెదడుతో ఆడుకుంటున్నాడు" అనే వాయిస్ ఓవర్ ఆయన పాత్ర తీవ్రతను తెలియజేస్తోంది. ఇక ట్రైలర్ చివర్లో తలకిందులుగా వేలాడుతున్న సింహాసనంపై కూర్చుని, స్టైల్‌గా సిగార్ తాగుతూ కనిపించిన మరో ప్రభాస్ లుక్ అందరినీ ఆశ్చర్యపరిచింది. "నేనేమైనా చీమనా పుట్టలో వేలు పెడితే కుట్టడానికి? నేనొక రాక్షసుడిని" అంటూ ఆయన చెప్పే డైలాగ్ సినిమాపై అంచనాలను పెంచుతోంది.

నిజానికి ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ 5న విడుదల చేయాలని ముందుగా భావించారు. అయితే తాజా ప్రకటన ప్రకారం, 'ది రాజా సాబ్' సినిమాను వచ్చే ఏడాది, అంటే 2026 జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తమ ఎక్స్ ఖాతాలో వెల్లడించింది. ప్రభాస్ కెరీర్‌లో పూర్తిస్థాయి హారర్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా, కార్తీక్ పళని సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.


More Telugu News

Prabhas The Raja Saab Maruthi horror thriller Sanjay Dutt Malavika Mohanan Nidhi Agarwal People Media Factory Telugu movie new trailer