Congress Debt Cards: జూబ్లీహిల్స్‌లో కేటీఆర్ కొత్త అస్త్రం.. ఇంటింటికీ 'కాంగ్రెస్ బాకీ కార్డులు' పంపిణీ

KTR distributes Congress Debt Cards in Jubilee Hills
  • జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ వినూత్న ప్రచారం
  • కాంగ్రెస్ గ్యారెంటీ కార్డులకు బదులుగా 'బాకీ కార్డులు' పంపిణీ
  • ఇంటింటికీ తిరిగి కార్డులు పంచుతున్న కేటీఆర్
  • నెరవేర్చని హామీలతో ప్రజలకు కాంగ్రెస్ బాకీపడిందని విమర్శ
  • ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపు
  • ప్రభుత్వ పాలనపై తీవ్ర స్థాయిలో ఫైర్
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారంలో అధికార కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పంపిణీ చేసిన 'గ్యారెంటీ కార్డుల'కు బదులుగా.. ఇప్పుడు బీఆర్ఎస్ 'కాంగ్రెస్ బాకీ కార్డులు' పేరుతో ప్రజల్లోకి వెళుతోంది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం స్వయంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, ఇంటింటికీ తిరిగి ఈ కార్డులను పంపిణీ చేశారు.

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్‌పేట, సమతా కాలనీలలో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, ఇతర నేతలతో కలిసి కేటీఆర్ విస్తృతంగా పర్యటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మోసపూరిత హామీలను గుర్తుచేసేందుకే ఈ ప్రచారం చేపట్టామని కేటీఆర్ తెలిపారు. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని ఆయన ప్రజలను కోరారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. వంద రోజుల్లో నెరవేరుస్తామన్న హామీలను 700 రోజులు గడిచినా కాంగ్రెస్ పట్టించుకోలేదని తీవ్రంగా విమర్శించారు. "మహిళలకు నెలకు రూ. 2,500 ఇస్తామన్న పథకం కింద ప్రతి మహిళకు ప్రభుత్వం రూ. 55,000 బాకీ పడింది. అలాగే, వృద్ధులకు రూ. 4,000 పింఛను పథకం కింద ఒక్కొక్కరికి రూ. 44,000 అప్పు ఉంది. ఈ అప్పులన్నింటినీ గుర్తు చేయడానికే ఈ బాకీ కార్డుల ఉద్యమం" అని వివరించారు.

పర్యటనలో భాగంగా స్థానికులు తమ సమస్యలను కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పారిశుద్ధ్యం లోపించిందని, చెత్త పేరుకుపోతోందని, మురుగునీరు నిలిచిపోతోందని, కరెంట్ కోతల వల్ల ఇన్వర్టర్లు కొనుక్కోవాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేసినట్లు పేర్కొన్నాయి. వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్, కాంగ్రెస్ పాలన తీరుపై విరుచుకుపడ్డారు. "ప్రస్తుత నగరం వరదల్లో మునిగిపోతుంటే, ప్రజలు దోమలతో బాధపడుతుంటే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 'ఫ్యూచర్ సిటీ' పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు" అని ఆయన ఎద్దేవా చేశారు. నిధుల కొరతపై మహబూబ్‌నగర్, ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలే స్వయంగా ఆందోళన వ్యక్తం చేయడమే వారి పాలనకు నిదర్శనమని అన్నారు. దివంగత మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అర్ధాంగి సునీతను ఆశీర్వదించి గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు.
Congress Debt Cards
KTR
BRS
Jubilee Hills
By Election

More Telugu News