Narendra Modi: ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన.. బటన్ నొక్కి నిధులు విడుదల చేసిన ప్రధాని మోదీ

Narendra Modi Launches Mukhyamantri Mahila Rojgar Yojana in Bihar
  • బీహార్‌లో ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన ప్రారంభం
  • తొలి దశలో 75 లక్షల మంది మహిళలకు ఆర్థిక సాయం
  • ఢిల్లీ నుంచి వర్చువల్‌గా పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
బీహార్‌లో మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్డీయే ప్రభుత్వం ఓ కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన’ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ పథకం కింద తొలి దశలో రాష్ట్రవ్యాప్తంగా 75 లక్షల మంది మహిళల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా రూ. 10,000 చొప్పున జమ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా ఒకేసారి మొత్తం రూ. 7,500 కోట్లను లబ్ధిదారులకు బదిలీ చేశారు.

ఈ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం పాట్నాలో జరగ్గా, ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. పాట్నాలోని కార్యక్రమంలో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కొందరు లబ్ధిదారులతో ముచ్చటించారు. మహిళల సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని కొనియాడారు.

గత పదేళ్లలో దేశవ్యాప్తంగా 30 కోట్లకు పైగా జన్ ధన్ ఖాతాలు తెరవడం వల్లే ఇప్పుడు ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులు జమ చేయగలుగుతున్నామని ప్రధాని మోదీ గుర్తుచేశారు. "ఒకప్పుడు కేంద్రం 100 రూపాయలు పంపిస్తే, ప్రజలకు చేరేసరికి 15 రూపాయలే మిగిలేవని ఓ మాజీ ప్రధాని చెప్పారు. కానీ ఈ రోజు, ప్రతి రూపాయి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి వెళుతోంది" అని ఆయన తెలిపారు.

ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మాట్లాడుతూ, మహిళల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. "ఇప్పుడు అందించిన రూ. 10,000 సాయంతో వ్యాపారంలో రాణించిన మహిళలకు భవిష్యత్తులో రూ. 2 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తాం" అని ఆయన హామీ ఇచ్చారు. పంచాయతీరాజ్ సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు, కోటికి పైగా జీవికా దీదీలతో గ్రామీణ ప్రాంతాల్లో మహిళల జీవితాలను మార్చామని నితీశ్ కుమార్ వివరించారు. ఇదే సమయంలో ఆయన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌పై పరోక్ష విమర్శలు చేశారు. 2005కు ముందు రాష్ట్రాన్ని పాలించిన వారు, పదవి పోగానే తమ భార్యను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టారని ఎద్దేవా చేశారు.

మొత్తం 3.06 కోట్ల దరఖాస్తులు రాగా, తొలి దశలో 75 లక్షల మందిని ఎంపిక చేసినట్లు ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి తెలిపారు. 2025లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎన్డీయే ప్రభుత్వం ఈ భారీ పథకాన్ని ప్రారంభించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. 
Narendra Modi
Mukhyamantri Mahila Rojgar Yojana
Bihar
Nitish Kumar
Women Empowerment
Samrat Choudhary
Vijay Kumar Sinha
Jan Dhan Accounts
Bihar Assembly Elections 2025

More Telugu News