హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్‌పై కార్మికుల దాడి!

  • ప్యాట్నీ కూడలి వద్ద విధులు నిర్వహిస్తున్న రఘునందన్‌పై దాడి
  • ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సూచించిన ఇన్‌స్పెక్టర్
  • దుర్బాషాలాడుతూ దాడికి పాల్పడిన ఇద్దరు కార్మికులు
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్‌పై దాడి జరిగింది. సికింద్రాబాద్‌లోని ప్యాట్నీ కూడలి వద్ద విధుల్లో ఉన్న ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రఘునందన్‌పై ఇద్దరు కార్మికులు దాడి చేయడంతో కలకలం రేగింది.

ప్యాట్నీ కూడలిలోని ఓ షాపింగ్ మాల్‌లో గత కొన్ని రోజులుగా మరమ్మతులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. రహదారిపై నిలిపి ఉంచిన ఆటోను తొలగించాలని, ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూడాలని ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సూచించారు.

దీంతో ఆగ్రహించిన ఇద్దరు కార్మికులు ఆయనను దూషిస్తూ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు బాధ్యులైన ఇద్దరిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ సంఘటనపై మోండా మార్కెట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News