'రంగమ్మత్త' పాత్రను నేను చేయాల్సింది: రాశి

  • చైల్డ్ ఆర్టిస్ట్ గా అదో రికార్డన్న రాశి 
  • మెగాస్టార్ జోడీగా చేయవలసిందని వెల్లడి
  • పవన్ అప్పట్లో మాట్లాడేవారు కాదని వ్యాఖ్య 
  • చరణ్ సినిమా చేయలేకపోయానని వివరణ  
         
తెలుగు తెరపై అందంగా మెరిసిన కథానాయికలలో రాశి ఒకరు. ఆమె కెరియర్లో చాలానే సూపర్ హిట్లు ఉన్నాయి. అలాంటి రాశి తాజాగా 'బిగ్ టీవీ'వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. "చైల్డ్ ఆర్టిస్టుగా నేను అమితాబ్ .. రజనీకాంత్ .. కమల్ హాసన్ గారితో నటించాను. ఆ తరువాత హీరోయిన్ గా వరుస సక్సెస్ లు చూశాను. చిరంజీవిగారి జోడీగా చేయవలసింది. కానీ కొన్ని కారణాల వలన కుదరలేదు" అని అన్నారు. 

"పవన్ కల్యాణ్ గారితో 'గోకులంలో సీత' సినిమా చేశాను. అప్పట్లో ఆయన పెద్దగా మాట్లాడేవారు కాదు. మా పాప ఫస్టు బర్త్ డేకి ఇన్వైట్ చేయడానికి వెళితే, ఎంతో ఆప్యాయంగా పలకరించారు. ఆయన అంతలా మాట్లాడతారని నేను ఊహించలేదు. 'గోకులంలో సీత 2' తీస్తే ఆయనతో చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అదే మాట సరదాగా ఆయనతో అన్నాను కూడా. ఆ సినిమా నా కెరియర్లో చెప్పుకోదగిన సినిమాలో ఒకటిగా నిలిచిపోయింది" అని చెప్పారు. 

"చరణ్ సినిమా 'రంగస్థలం'లో 'రంగమ్మత్త' పాత్ర కోసం ముందుగా నన్ను అడిగారు. ఆ పాత్రను గురించి నాకు చెప్పారు. నాకున్న ఇమేజ్ కి  కొన్ని సీన్స్ ఇబ్బందిగా అనిపిస్తాయని అన్నాను. పైగా నా ఫేస్ ఆ పాత్రకి తగినట్టుగా ఉండదేమోనని అనిపించింది. అదే మాట వాళ్లతో చెప్పాను. ఆ తరువాత ఆ పాత్రను అనసూయ చేసింది. ఆ పాత్రకి తను కరెక్టుగా సరిపోయింది .. చాలా బాగా చేసింది కూడా" అని అన్నారు.



More Telugu News