ఆసియా కప్.. ఫైనల్ చేరాలంటే పాకిస్థాన్‌కు ఇదే దారి

  • ఆసియా కప్ సూపర్ 4లో భారత్ చేతిలో పాకిస్థాన్ ఓటమి
  • ఫైనల్ చేరాలంటే పాక్‌కు మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలవడం తప్పనిసరి
  • రేపు శ్రీలంక, గురువారం బంగ్లాదేశ్‌తో పాక్ తదుపరి మ్యాచ్‌లు
  • ఒక్క మ్యాచ్ ఓడినా పాకిస్థాన్ టోర్నీ నుంచి దాదాపు నిష్క్రమించినట్టే
  • మరోవైపు ఒక గెలుపుతో ఫైనల్‌కు చేరువైన టీమిండియా
  • ఫైనల్ రేసులో బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు కూడా -
ఆసియా కప్ 2025లో ఫైనల్ చేరాలన్న పాకిస్థాన్ ఆశలకు ఆదివారం భారత్ చేతిలో ఎదురైన ఓటమితో గట్టి దెబ్బ తగిలింది. సూపర్ 4 దశలో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. అయితే ఇది నాకౌట్ మ్యాచ్ కాకపోవడంతో సల్మాన్ ఆఘా సేనకు అవకాశాలు ఇంకా పూర్తిగా మూసుకుపోలేదు. కానీ, ఫైనల్ చేరాలంటే మాత్రం ఇకపై ప్రతీ మ్యాచ్ చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

సూపర్ 4 రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో జరగనుండటంతో పాకిస్థాన్‌కు ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఫైనల్ రేసులో నిలవాలంటే ఆ జట్టు రేపు శ్రీలంకతో, గురువారం బంగ్లాదేశ్‌తో జరగనున్న మ్యాచ్‌లలో తప్పనిసరిగా గెలవాల్సి ఉంది. ఈ రెండింటిలో ఏ ఒక్క మ్యాచ్ ఓడిపోయినా పాకిస్థాన్ టోర్నీ నుంచి నిష్క్రమించడం దాదాపు ఖాయం. ఒకవేళ రెండింటిలోనూ గెలిస్తే, ఇతర జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా ఫైనల్‌కు చేరే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.

ప్రస్తుత పాయింట్ల పట్టికను పరిశీలిస్తే భారత్, బంగ్లాదేశ్ చెరో విజయంతో రెండేసి పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాయి. నెట్ రన్‌రేట్ (+0.689) విషయంలో భారత్ మెరుగ్గా ఉంది. మరోవైపు, పాకిస్థాన్, శ్రీలంక ఆడిన తొలి మ్యాచ్‌లలో ఓడి సున్నా పాయింట్లతో ఉన్నాయి. బంగ్లాదేశ్, శ్రీలంక జట్లకు కూడా ఇంకా ఫైనల్ చేరే అవకాశాలు సజీవంగానే ఉన్నాయి. బంగ్లాదేశ్ ఇప్పటికే ఒక విజయం సాధించగా, శ్రీలంక కూడా పుంజుకునే సత్తా ఉన్న జట్టే.

ఇక టీమిండియా విషయానికొస్తే, పాకిస్థాన్‌పై విజయంతో ఫైనల్‌కు దాదాపు ఒక అడుగు దూరంలో నిలిచింది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు తమ తదుపరి మ్యాచ్‌లలో బంగ్లాదేశ్, శ్రీలంకలతో తలపడనుంది. ఈ రెండింటిలో ఒక్క మ్యాచ్ గెలిచినా భారత్ సునాయాసంగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది.


More Telugu News