మనీ లాండరింగ్ కేసు: సుప్రీంకోర్టును ఆశ్రయించిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్

  • తనపై కేసు కొట్టివేయాలన్న జాక్వెలిన్ పిటిషన్‌ను తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు
  • హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్
  • సుకేశ్ చంద్రశేఖర్ నుంచి ఖరీదైన బహుమతులు పొందినట్లు ఆరోపణలు
  • రూ. 7.2 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ
  • సెప్టెంబర్ 22న జాక్వెలిన్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తనపై ఉన్న మనీలాండరింగ్ కేసు విషయంలో సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ కేసును కొట్టివేయాలంటూ తాను దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడంతో, ఆ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను సెప్టెంబర్ 22న జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసిహ్‌లతో కూడిన ధర్మాసనం విచారించనుంది.

వివరాల్లోకి వెళితే, ఘరానా మోసగాడు సుకేశ్ చంద్రశేఖర్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సుకేశ్ నుంచి ఆమె ఖరీదైన బహుమతులు, ఆర్థిక ప్రయోజనాలు పొందినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆరోపించింది. ఈ బహుమతుల విలువ సుమారు రూ. 7.2 కోట్లు ఉంటుందని, అది నేరపూరిత ఆదాయమేనని పేర్కొంటూ ఈడీ ఆమె ఆస్తులను అటాచ్ చేసింది.

ఈ నేపథ్యంలో తనపై నమోదైన కేసును రద్దు చేయాలని కోరుతూ జాక్వెలిన్ తొలుత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సుకేశ్ అక్రమ సంపాదనతో తనకు ఎలాంటి సంబంధం లేదని, మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద తనపై విచారణ జరపడం సరికాదని ఆమె తన పిటిషన్‌లో వాదించారు. అయితే, జస్టిస్ అనీశ్ దయాళ్ నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం ఆమె వాదనలను తోసిపుచ్చింది. ఈడీ చేసిన ఆరోపణలపై ట్రయల్ కోర్టులో విచారణ జరగాల్సిందేనని స్పష్టం చేస్తూ, కేసులో జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది.

హైకోర్టులో ఊరట లభించకపోవడంతో జాక్వెలిన్ సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఈ కేసులో ఈడీ ఇప్పటికే పలు ఛార్జిషీట్లు దాఖలు చేసింది. అనుబంధ ఛార్జిషీట్‌లో జాక్వెలిన్‌ను నిందితురాలిగా చేర్చగా, మరో నటి నోరా ఫతేహిని సాక్షిగా విచారించింది. సుకేశ్ తరఫున అతని సహాయకురాలు పింకీ ఇరానీ ఖరీదైన బహుమతులను జాక్వెలిన్‌కు చేరవేసినట్లు ఈడీ తన దర్యాప్తులో పేర్కొంది.


More Telugu News