అహ్మదాబాద్ విమాన ప్రమాదం... బోయింగ్, స్విచ్ ల తయారీ కంపెనీ హనీవెల్ పై అమెరికాలో దావా

  • అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంలో కీలక పరిణామం
  • విమాన తయారీ సంస్థ బోయింగ్, హానీవెల్‌పై మృతుల కుటుంబాల దావా
  • కాక్‌పిట్‌లోని ఇంధన స్విచ్‌ల డిజైన్‌లో లోపమే కారణమని ఆరోపణ
  • పొరపాటున స్విచ్‌లు ఆగిపోవడం వల్లే ఇంజిన్లు ఫెయిల్ అయ్యాయని వాదన
  • ఈ దుర్ఘటనలో మొత్తం 260 మంది దుర్మరణం
  • పరిహారం కోరుతూ అమెరికాలోని డెలావేర్ కోర్టులో పిటిషన్
జూన్ 12న అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర ఎయిరిండియా విమాన ప్రమాద ఘటన కీలక మలుపు తిరిగింది. 260 మందిని బలిగొన్న ఈ దుర్ఘటనకు విమానంలోని సాంకేతిక లోపమే కారణమంటూ మృతులలో నలుగురి కుటుంబ సభ్యులు అమెరికాకు చెందిన విమాన తయారీ దిగ్గజం బోయింగ్, ఏరోస్పేస్ పరికరాల సంస్థ హానీవెల్‌పై కేసు వేశారు. కాక్‌పిట్‌లోని ఇంధన కటాఫ్ స్విచ్‌ల డిజైన్‌లో తీవ్ర లోపం ఉందని, దాని వల్లే ఈ దారుణం జరిగిందని ఆరోపిస్తూ అమెరికాలోని డెలావేర్ సుపీరియర్ కోర్టులో దావా వేశారు.

గత మంగళవారం దాఖలు చేసిన ఈ పిటిషన్ ప్రకారం, బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానంలో థ్రస్ట్ లివర్ల కింద ఉన్న ఇంధన స్విచ్‌ల అమరిక ప్రమాదకరంగా ఉంది. సాధారణ కార్యకలాపాల సమయంలో పైలట్లు పొరపాటున వాటిని తాకే అవకాశం ఉందని, దీనివల్ల ఇంజిన్‌లకు ఇంధన సరఫరా నిలిచిపోయిందని కుటుంబాలు ఆరోపించాయి. జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయలుదేరిన AI171 విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే రెండు ఇంజిన్లు ఆగిపోయి సమీపంలోని భవనంపై కుప్పకూలిన విషయం తెలిసిందే.

భారత విమాన ప్రమాద దర్యాప్తు బృందం (AAIB) ప్రాథమిక నివేదిక కూడా ఈ వాదనలకు బలం చేకూర్చేలా ఉంది. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌లో ఒక పైలట్ "ఇంధనాన్ని ఎందుకు ఆపావు?" అని అడగ్గా, మరో పైలట్ "నేను ఆపలేదు" అని సమాధానమిచ్చినట్లు రికార్డయింది. దర్యాప్తులో ఇంధన స్విచ్‌లు 'కటాఫ్' పొజిషన్‌లో ఉన్నట్లు తేలింది. సిబ్బంది 14 సెకన్లలోనే వాటిని తిరిగి 'రన్' పొజిషన్‌కు మార్చినప్పటికీ, అప్పటికే విమానం నియంత్రణ కోల్పోయి 32 సెకన్లలోనే నేలకూలింది.

అయితే, ఈ స్విచ్‌ల డిజైన్‌కు అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) ఆమోదం ఉంది. వీటిని పొరపాటున యాక్టివేట్ చేయడం దాదాపు అసాధ్యమని కొందరు విమానయాన నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా విమాన ప్రమాదాలు జరిగినప్పుడు, ఎయిర్‌లైన్‌లపై పరిహారానికి పరిమితులు ఉండటంతో తయారీ సంస్థలపై దావాలు వేయడం సాధారణమని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ కేసులో బాధితుల కుటుంబాలు ఎంత పరిహారం కోరుతున్నాయో వెల్లడించలేదు. ఈ దావాతో ప్రపంచవ్యాప్తంగా బోయింగ్ 787 విమానాల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది.


More Telugu News