200 మంది కాంట్రాక్టు ఉద్యోగులను సాగనంపిన గూగుల్!

  • జెమిని, ఏఐ ప్రాజెక్టులపై పని చేస్తున్న 200 మందికి పైగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు గూగుల్ గుడ్‌బై
  • ముందస్తు సమాచారం లేకుండా అలా గుడ్‌బై చెప్పడంపై పలువురు ఉద్యోగులు అసంతృప్తి
  • ఆ ఉద్యోగులు సంస్థ ఉద్యోగులు కాదన్న గూగుల్
టెక్ దిగ్గజం గూగుల్‌లో ఉద్యోగుల తొలగింపు అంశం మరోసారి చర్చనీయాంశమైంది. తాజాగా, కంపెనీలోని ఏఐ ప్రాజెక్టులపై పనిచేస్తున్న 200 మందికి పైగా కాంట్రాక్ట్ ఉద్యోగులను హఠాత్తుగా తొలగించినట్లు సమాచారం. వీరిలో అత్యధికులు జెమిని చాట్‌బాట్, ఇతర ఏఐ టూల్స్ అభివృద్ధిలో నిమగ్నమై ఉండటం గమనార్హం. తమ తొలగింపు గురించి ముందుగా తెలియకుండానే ఒక్కసారిగా విధుల నుంచి తొలగించడంతో పలువురు ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఈ కాంట్రాక్టర్లలో చాలామంది మాస్టర్స్, పీహెచ్‌డీ విద్యార్హతలు కలిగినవారు కాగా, కొందరు "సూపర్ రేటర్స్"గా గుర్తింపు పొందినవారు కూడా ఉన్నారు. ఈ విషయంపై గూగుల్ ప్రతినిధులు స్పందిస్తూ, "ఈ ఉద్యోగులు నేరుగా గూగుల్ ఉద్యోగులు కాదు. వారు నియామక ఏజెన్సీ లేదా సబ్‌కాంట్రాక్టర్ల ద్వారా పనిచేస్తున్నారు" అని తెలిపారు. ఇది కంపెనీ తీసుకున్న ప్రత్యక్ష నిర్ణయం కాదని వారు సూచనప్రాయంగా వెల్లడించారు.

దీంతో టెక్ పరిశ్రమలో కాంట్రాక్ట్ ఉద్యోగుల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. సాధారణంగా, గూగుల్ వంటి అనేక పెద్ద కంపెనీలు తమ ఏఐ ప్రాజెక్టుల కోసం తాత్కాలిక ఉద్యోగులను పెద్ద సంఖ్యలో వినియోగిస్తుంటాయి. అయితే, స్వల్ప వ్యవధిలో నోటీసు ఇచ్చి ఉద్యోగాల నుంచి తొలగించడం వంటి పరిస్థితులు కాంట్రాక్టర్లు, వాలంటీర్ల భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. 


More Telugu News