Enforcement Directorate: 1xBet బెట్టింగ్ యాప్ కేసు.. యువరాజ్, సోనూ సూద్‌లకు ఈడీ సమన్లు

Yuvraj Singh Robin Uthappa Sonu Sood summoned by ED IN 1xBet case
షార్ట్స్‌లో చూడండి
అక్రమ బెట్టింగ్ యాప్ ‘1xBet’కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో ఇప్పటికే పలువురు సినీ, క్రీడా ప్రముఖులను ప్రశ్నించిన అధికారులు.. తాజాగా మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్ప, ప్రముఖ నటుడు సోనూ సూద్‌లకు సమన్లు జారీ చేశారు. ఈ నెలలోనే వారిని విచారించేందుకు ఈడీ సిద్ధమైంది.

ఈడీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ నెల‌ 22న రాబిన్ ఉతప్ప, 23న యువరాజ్ సింగ్, 24న సోనూ సూద్ విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ బెట్టింగ్ యాప్‌ను ప్రచారం చేసినందుకు గాను వారి ఆర్థిక లావాదేవీలు, ఒప్పందాలపై అధికారులు ఆరా తీయనున్నారు. కాగా, ఈ కేసులో భాగంగా బెంగాలీ నటుడు అంకుశ్ హజ్రా, మాజీ ఎంపీ మిమీ చక్రవర్తి మంగళవారం తమ పత్రాలను ఈడీ అధికారులకు సమర్పించారు.

ఈ విషయంపై వారి తరఫు న్యాయవాది శశి కౌశిక్ మాట్లాడుతూ, "వారు సమర్పించినవి సాధారణ పత్రాలు మాత్రమే. అందులో ముఖ్యమైనవి ఏమీ లేవు. విచారణలో భాగంగా అధికారులు వారి కాంటాక్టులను ధృవీకరించుకుంటున్నారు. ఇది కేవలం దర్యాప్తులో ఒక సాధారణ ప్రక్రియ మాత్రమే" అని వివరించారు.

1xBet బెట్టింగ్ యాప్ కార్యకలాపాల్లో భారీగా మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ ఆరోపణలు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఈ యాప్‌కు ప్రచారకర్తలుగా వ్యవహరించిన ప్రముఖులపై దృష్టి సారించింది. గతంలో భారత మాజీ క్రికెటర్లు శిఖర్ ధావన్, సురేశ్ రైనాలను కూడా ఈడీ అధికారులు గంటల తరబడి ప్రశ్నించారు. సైప్రస్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థపై ఇప్పటికే యూకే, అమెరికా, రష్యా, స్పెయిన్, ఫ్రాన్స్ వంటి దేశాల్లో ఆర్థిక అవకతవకల ఆరోపణలతో నిషేధం అమల్లో ఉంది. గతేడాది సంచలనం సృష్టించిన ‘మహాదేవ్ సట్టా యాప్’ కుంభకోణం తరహాలోనే ఈ కేసులో కూడా పలువురు సెలబ్రిటీల ప్రమేయం బయటపడటం గమనార్హం.
Go Back to Shorts
Enforcement Directorate
1xBet
Sonu Sood
Yuvaraj Singh
Robin Uthappa
ED
Betting App
Money Laundering Case
Shikhar Dhawan
Suresh Raina

More Telugu News