పాక్ సైన్యం లక్ష్యంగా బాంబు దాడి.. ఐదుగురు సైనికులు దుర్మరణం

  • బలూచిస్థాన్‌లో పాక్ ఆర్మీ వాహనంపై ఐఈడీ దాడి
  • మృతుల్లో ఓ ఆర్మీ కెప్టెన్ కూడా ఉన్నట్లు వెల్లడి
  • మే నెలలోనూ ఇదే తరహా దాడిలో 12 మంది సైనికులు మృతి
పాకిస్థాన్‌లో మరోసారి ఉగ్రవాదులు పంజా విసిరారు. బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో పాకిస్థాన్ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని జరిపిన శక్తివంతమైన ఐఈడీ బాంబు దాడిలో ఐదుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

వివరాల్లోకి వెళితే, బలూచిస్థాన్‌లోని మాండ్లో పరిధిలోని షాండ్ ప్రాంతంలో సైనిక కాన్వాయ్‌లోని ఒక వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగింది. సైనికులు ప్రయాణిస్తున్న వాహనం సమీపంలో ఉగ్రవాదులు అమర్చిన ఐఈడీ పేలడంతో ఐదుగురు సైనికులు అక్కడికక్కడే మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. మృతుల్లో కెప్టెన్ వకార్ కాకర్, నాయక్ జునైద్, నాయక్ ఇస్మత్, లాన్స్ నాయక్ ఖాన్ ముహమ్మద్, సిపాయి జహూర్ ఉన్నట్లు గుర్తించారు. పేలుడు అనంతరం భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి గాలింపు చర్యలు చేపట్టాయి.

బలూచిస్థాన్‌లో పాకిస్థాన్ సైన్యంపై దాడులు జరగడం ఇదే మొదటిసారి కాదు. గత మే నెలలోనూ ఇదే తరహాలో జరిగిన శక్తివంతమైన ఐఈడీ దాడిలో 12 మంది సైనికులు మరణించారు. బలూచిస్థాన్ విముక్తి కోసం పోరాడుతున్న బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ) ఆ దాడికి తామే బాధ్యత వహిస్తున్నట్లు అప్పట్లో ప్రకటించింది. తరచూ జరుగుతున్న ఈ దాడులు పాకిస్థాన్ సైన్యానికి పెను సవాలుగా మారాయి. 


More Telugu News